అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికి అనధికారికంగా రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత కాస్ట్ లీగా చరిత్రలో మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీల్లో ఎక్కడ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విజయం సాధించడమే తమ లక్ష్యంగా చూస్తున్నాయి. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు కానీ విజయమే ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో పార్టీల్లో డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేస్తారనే విషయం అందరికి తెలుస్తుంది.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. పార్టీ ఏడేళ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో నిధుల సమస్య తలెత్తుతోంది. దీంతో ఇప్పటి నుంచే పోటీలో ఉంటే ఖర్చు పెరిగిపోతుందని భావించే నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురుచూస్తుందని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును ఖరారు చేసినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో రెండు పార్టీల్లో దూకుడు పెరిగినా కాంగ్రెస్ లో మాత్రం జోష్ కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో పార్టీల్లో ప్రచారం జోరుగానే సాగుతోంది. దీటుగా బీజేపీ, టీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. ఎలాగైనా విజయం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయాయి. ఇందులో భాగంగానే అధికార పార్టీ దళితబంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తున్నా సానుభూతితోనే ఓట్లు సాధించాలని బీజేపీ కూడా ఆలోచిస్తోంది. దీంతో నియోజకవర్గంలో రెండు పార్టీలు సమ ఉజ్జీలుగా నిలుస్తున్నాయి. పోటీ కూడా రెండు పార్టీల్లోనే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అని చెబుతున్నారు.