WhatsApp: భారత్‌ను వీడతానంటున్న వాట్సాప్‌.. కారణం అదే?

వైరల్‌ అవుతున్న మెసేజ్‌లతోపాటు వ్యక్తిగతంగా, గ్రూప్‌లో షేర్‌ చేస్తున్న మెసేజ్‌ల మూలకర్తలను గుర్తించాలంటే వాటిని డీక్రిప్ట్‌ చేయాల్సి ఉంటుంది. లక్షల సందేశాలను ఏళ్లపాటు డేటాబేస్‌లో అట్టేపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదని కరియా కోర్టుకు తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : April 26, 2024 3:59 pm

WhatsApp

Follow us on

WhatsApp: మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్‌ భారత్‌ను వీడుతామంటోంది. కొత్త ఐటీ నిబంధనలతో పనిచేయలేమని చెబుతోంది. ఈమేరు ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఐటీ చట్టం ప్రకారం పనిచేయాలంటే కష్టమని తెలిపింది. తప్పనిసరిగా పాటించలంటే భారత్‌ను వీడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. వినియోగదారుల గోప్యతకు పెద్దపీట వేస్తున్నామని ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేస్తున్నందుకే యాప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది.

కొత్త చట్టంలో ఏముంది..
భారత ప్రభుత్వం 2021లో కొత్త ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టంలో మెసేజింగ్‌ యాప్‌ చాట్‌లను ట్రేస్‌ చేసేలా సవరణ చేశారు. వాటిని మొదటగా ఎవరు పంపించారో గుర్తించేలా కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను వాట్సప్‌ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టుకు వాట్సాప్‌ తరఫున న్యాయవాది కరియా తన వాదనలు వినిపించారు. కొత్త ఐటీ నిబంధనలు పాటించేలా వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లేలా ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఇలా చేస్తే వాట్సప్‌ ఇండియా నుంచి వైదొలుగుతుందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం యూజర్లు పంపుతున్న మెసేజ్‌ల్లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్క్రిప్ట్‌ విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా కొన్నిమెసేజ్‌లు వైరల్‌ అవుతుంటాయి. వాటిని ముందుగా ఎవరు పంపించారో తెలియేజేసేలా ఐటీ నిబంధనలున్నాయి.

డీక్రిప్ట్‌ చేయాలి..
వైరల్‌ అవుతున్న మెసేజ్‌లతోపాటు వ్యక్తిగతంగా, గ్రూప్‌లో షేర్‌ చేస్తున్న మెసేజ్‌ల మూలకర్తలను గుర్తించాలంటే వాటిని డీక్రిప్ట్‌ చేయాల్సి ఉంటుంది. లక్షల సందేశాలను ఏళ్లపాటు డేటాబేస్‌లో అట్టేపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదని కరియా కోర్టుకు తెలిపారు.

కొన్ని కేసుల్లో మెస్సేజ్‌లే కీలకం..
ఇదిలావుండగా, మతపరమైన హింస వంటి కొన్ని కేసుల్లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన కంటెంట్‌ ప్రసారం అవుతున్నపుడు ప్రభుత్వ నియమం చాలా ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్రం తరఫు న్యాయవాది అన్నారు. అందుకోసమే ఐటీ చట్టంలో నిబంధన చేర్చినట్లు వెల్లడించారు. ఇద్దరి వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది. ఐటీ నిబంధనల్లో పలు అంశాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని ఇతర పిటిషన్ల విచారణను ఆగస్టు 14కు షెడ్యుల్‌ చేయాలని బెంచ్‌ ఆదేశించింది.