Munugode By Election 2022: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రస్నం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దాదాపు నెల రోజుల ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. దీంతో ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రచారం ముగిసిన రాత్రే టీఆర్ఎస్కు సంబంధించిన వాచ్లు, మద్యం భారీగా పట్టుపడడం ప్రలోభాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి. ఓటుకు ఇంత అని ధర ఫిక్స్ చేసి మరీ పంపిణీ చేసేందుకు నేతలు రంగం సిద్ధమయ్యారు. ఒక పార్టీ రూ.4 వేల నుంచి రూ.5 వేల దాకా పంచే ఆలోచనలో ఉంటే, ఇంకోపార్టీ దీనికి కొంత అదనంగా జోడించి రూ.6 వేల దాకా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మరో పార్టీ ఓటుకు రూ. వెయ్యి పెంచి రూ.7 వేలు లేదా రూ.8 వేలు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. మొత్తంమీద రూ.10 వేల వరకు ధర పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పంచుడు మొత్తం రూ.250 కోట్లు దాటవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పటికే మూడు పార్టీలు మునుగోడుకు తరలించినట్లు సమాచారం. హవాలా నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ దాకా అన్ని అవకాశాలనూ పంపిణీకి వినియోగించుకుంటున్నాయి.

హవాలా మార్గంలో మునుగోడుకు డబ్బులు..
హైదరాబాద్ సహా చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి వరంగల్ ,ఖమ్మ, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున డబ్బును హవాలా మార్గంలో మునుగోడుకు మూడు పార్టీలు చేరవేశాయి. నిబంధనల ప్రకారం ఎన్నికల సమయంలొ ఎవరివద్ద అయినా రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ నగదును పట్టుకుంటే, వారు ఆ నగదుకు ఎన్నికలకు సంబంధం లేదని రుజువ చేసే వివరాలు, కారణాలు, రసీదులు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడమే ఈ నిబంధన లక్ష్యం. ఈ క్రమంలోనే మునుగోడు సరిహద్దు జిల్లాలు, మండలాలు, గ్రామాలలో కూడా రహదారులపై ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ఫలితంగా పలు పార్టీల నాయకులు హవాలా మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటకీ వారు కళ్లుగప్పి వీఐపీల వాహనాల్లో మునుగోడుకు డబ్బు తరలిస్తున్నారు. కేంద్ర బలగాలు ఉన్న చోట పకడ్భందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

చివరి రోజే కీలకం..
మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి విస్తృతంగా ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్ధులు ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి హాజరయ్యేవారికి రూ. 300 నుంచి రూ.500 చొప్పున కూలీ ఇచ్చారు. బీరు, బిర్యాని అదనం. ప్రజా ప్రతినిధులు ఏ పదవిలో ఉన్నా రేటు నిర్ణయించి నగదు, నజరానాలు ముట్టజెబుతున్నారు. ఖరీదైన కార్లు కొనిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వందల సంఖ్యలో వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే చివరి బుధవారం ఓటర్లకు డబ్బు పంచడం మరొక ఎత్తు. దీన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీ ఓటుకు ఎంతిస్తుందో చూసి దానికి రెండింతలు , అవసరమైతే మూడింతలు ఇచ్చేలా సమాయత్తమవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో 2.42 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి?, ఎంతచొప్పున ఇవ్వాలి?అని జాబితాలు తయారు చేస్తున్నారు. రాజమార్గంలో, అడ్డదారిలో, ఆన్లైన్ పద్దతిలో, గూగుల్పే, ఫోన్పే ద్వారా ఇలా, ఎలా వీలైతే అలా ఓటుకు నోటు ఇవ్వడానికి నిధులు సమకూర్చుకుంటున్నాయి.
ఖరీదైన ఎన్నికలుగా గుర్తింపు..
రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలతో పోలీస్తే మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ఖరీదైన ఎన్నికగా మార్చేశాయి. హైదరాబాద్ నుంచి మునుగోడుకు హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బు చేరవేస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, మద్యం ట్రేడర్లు, ఆడితీ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, పెట్రోల్ బంకుల నిర్వాహకులు, ఫెర్టిలైజర్ వ్యాపారులతో డీల్స్ మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో వారి తరుపువారికి డబ్బు ముట్టజెప్పి కమీషన్ పోను మిగతా సొమ్మును మనుగోడులో వీరి నుంచి తీసుకుంటున్నారు. అలాగే మునుగోడులో ఉండేవారిలో ఎవరు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వగలరో ఆరా తీసి వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఏపి, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా హవాలా రూపంలో మునుగోడుకు పెద్ద ఎత్తున డబ్బు వస్తుండటం గమనార్హం.