https://oktelugu.com/

Waqf Bill : ఏమిటీ వక్ఫ్.. దేశవ్యాప్తంగా ఎందుకింత చర్చ?

Waqf Bill : వక్ఫ్ బిల్లు(Waqf Bill)పై దేశ వ్యాప్తంగా కొద్దిరోజులుగా విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇది వివాదాస్పద బిల్లు అని విపక్షాలు ఆరోపిస్తుంటే.. ఇన్నాళ్లకు ముస్లింలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది.

Written By: , Updated On : April 2, 2025 / 07:59 AM IST
Waqf Bill

Waqf Bill

Follow us on

Waqf Bill : వక్ఫ్ బిల్లు పై బుధవారం పార్లమెంట్లో చర్చ సాగనుంది. పార్లమెంటుకు తప్పక హాజరుకావాలని అన్ని పార్టీలు వారి పార్లమెంట్ సభ్యులకు అల్టిమేటం జారీ చేశాయి. కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో అనేక వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం కావాలని తేనె తుట్టె లాంటి అంశాన్ని కదుపుతోందని విమర్శిస్తున్నాయి.. రెండు వర్గాల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతిస్తోందని మండిపడుతున్నాయి.

ఆ వివాదాస్పద అంశాలు ఏంటంటే..

వక్ఫ్ అనే పదానికి అర్థం దాతృత్వం లేదా మతపరమైన విరాళం.. ముస్లిం సామాజిక వర్గంలో వక్ఫ్ అనేది ఎక్కువగా స్థిరాస్తి రూపంలోనే ఉంటుంది. వక్ఫ్ కు సంబంధించి ఎక్కువ భాగం స్థిరాస్తులు చెల్లుబాటు కానీ పత్రాలు లేకుండానే ఉన్నాయి.. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మసీదులు, మదర్సాలు, స్మశాన వాటికలు, ముస్లిం అనాధ ఆశ్రమాల నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలనే కట్టుబడి ఉంది. అయితే ఇక్కడ వక్ఫ్ ను ఒక ఆస్తిగా నిర్ధారించిన తర్వాత దానిని ఒక వ్యక్తి లేదా సంస్థకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అమ్మడం కూడా వీలుకాదు. భారత దేశంలో 10 లక్షల ఎకరాల భూములు, 8.72 లక్షల ఆస్తులు వక్ఫ్ బోర్డు నియంత్రణలో ఉన్నాయి..వక్ఫ్ బిల్లులో కేంద్రం తీసుకొచ్చిన సవరణలు వివాదాస్పదంగా మారాయి.. వక్ఫ్ బోర్డులో ఉన్న ఆస్తుల వివాదాలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఉండడంతో ముస్లింలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

Also Read : శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం?

అందువల్లే వ్యతిరేకిస్తున్నారు

బుధవారం పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లులో ఐదు ప్రతిపాదిత సవరణలున్నాయి. వాటిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి ముస్లిం సంస్థ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి..

కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిం సామాజిక వర్గానికి చెందని వ్యక్తులు కూడా సభ్యులుగా చేరవచ్చని ప్రతిపాదనను కేంద్రం తప్పనిసరి చేసింది..

వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వివాదం ఉంటే.. అది ప్రభుత్వానికి దక్కుతుందా? వక్ఫ్ కు దక్కుతుందా? అనే విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ నిర్ణయం తీసుకోరు.. అలాంటప్పుడు తీర్పు తమకు వ్యతిరేకంగా ఉంటుందని ముస్లిం సంస్థలు వాదిస్తున్నాయి.

జిల్లా న్యాయమూర్తి, సంయుక్త కార్యదర్శి హోదా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ అధికారిని వక్ఫ్ ట్రిబ్యూనల్ బోర్డులో చేర్చాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయవచ్చని కూడా బిల్లులో స్పష్టం చేసింది. ఒకవేళ ఈ బిల్లు గనుక చట్టంగా అమల్లోకి వస్తే 6 నెలల లోపు ప్రతి వక్ఫ్ ఆస్తిని కేంద్రం తన పోర్టల్ లో నమోదు చేయాలి..

మరోవైపు వక్ఫ్ ట్రిబ్యునల్ ఎంపిక చేసిన “వక్ఫ్ బై యూజర్” క్లాజ్ ను తొలగించడానికి తీసుకొచ్చిన ప్రతిపాదనను ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.. ఈ నిబంధన ప్రకారం ఆస్తిని మతపరమైన లేదా ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగిస్తే.. ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండానే దానిని వక్ఫ్ ఆస్తిగా పరిగణిస్తారు. అయితే దీనిని తొలగించాలని వక్ఫ్ బిల్లులో కేంద్రం పొందుపరిచింది. ఎన్డీఏ మిత్రపక్షం టిడిపి సిఫారసు చేసిన తర్వాత దీనిని తొలగించాలని జాయింట్ పార్లమెంట్ కమిటీ కేంద్రానికి సూచించింది.

Also Read : వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ