విశాఖ జిల్లాలో ఈ దారుణ దుర్ఘటన జరిగింది. పెందుర్తి మండలం జుత్తాడలో పాతకక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలయ్యారు. గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో బత్తిన అప్పల రాజు అనే వ్యక్తి అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మరో కుటుంబంలోని ఆరుగురిని బలితీసుకున్నాడు. అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటనతో జుత్తాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతులు బొమ్మిడి రమణ (63), బొమ్మిది ఉషారాణి (35), అల్లు రమాదేవి (58), సక్కెళ్ల అరుణ (37), ఉషారాణి పిల్లలు బొమ్మిది ఉదరు (2), బొమ్మిడి ఉర్విష (6 నెలలు)గా గుర్తించారు. ఆరుగురిని పొట్టనబెట్టుకున్న నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది.
కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు లొంగిపోయిన విషయాన్ని అయితే పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆరుగురిని బలితీసుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని జుత్తాడ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ఉదంతం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.