Vangaveeti Radhakrishna Engagement : ఘనంగా వంగవీటి రాధా నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడు? వధువు ఎవరంటే?

నరసాపురం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కం అమ్మాని, బాబ్జి దంపతుల కుమార్తె పుష్పవల్లితో రాధాకృష్ణ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : September 3, 2023 6:25 pm
Follow us on

Vangaveeti Radhakrishna Engagement : వంగవీటి మోహన్ రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ నిశ్చితార్థం నరసాపురంలో వైభవంగా నిర్వహించారు. నరసాపురం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కం అమ్మాని, బాబ్జి దంపతుల కుమార్తె పుష్పవల్లితో రాధాకృష్ణ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే.

నిశ్చితార్థ వేడుకలు పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ మదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ తో పాటు నరసాపురానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 22న వీరి వివాహం నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తొలుత బెంగళూరులో వివాహ వేడుకలు జరుగుతాయని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నరసాపురంలో సాదాసీదాగానే నిశ్చితార్థ వేడుకలు నిర్వహించారు.

ఏపీ పాలిటిక్స్ లో రాధాకృష్ణ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్. 2004 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిన్న వయసులో శాసనసభలో అడుగుపెట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో వెళ్లి.. పోటీ చేసినా ఓటమే ఎదురయింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట వెళ్లారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో టిడిపి గూటికి వచ్చారు. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. అప్పట్నుంచి టిడిపిలోనే కొనసాగుతున్నారు. జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా.. అటువంటి కార్యాచరణేది కనిపించలేదు. ఇప్పుడు జనసేన నేత కుమార్తెను వివాహం చేసుకోనుండడంతో ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగుతోంది.