తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. దుబ్బాక బరిలో తలపడేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తొడగొట్టిన మార్నాడే సీఎం కేసీఆర్ కూడా సై అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సొలిపేట సుజాత పేరును సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు.
Also Read: ప్రపంచంలోనే సేఫ్ సిటీగా హైదరాబాద్
‘తెలంగాణ ఉద్యమంలో సోలిపేట రామలింగారెడ్డి క్రియాశీల పాత్ర పోషించారు. పార్టీ కోసం.. ఉద్యమం కోసం జీవితం ధారపోశారు. దుబ్బా క నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పనిచేశారు. అందుకే వారి కుటుంబానికే నియోజకవర్గ ప్రాతినిధ్యం ఇవ్వడం సమంజసం. అందుకే సోలిపేట భార్య సుజాతను టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశాం’ అని కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ఇచ్చింది.
ఏ ఎన్నికలు వచ్చినా అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటుంది. నోటిఫికేషన్ విడుదలై.. నామినేషన్ల ప్రక్రియ నడుస్తున్నా అభ్యర్థిని ఫైనల్ చేయరు. కానీ.. ఈసారి దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రం తన స్టంట్ను మార్చుకున్నట్లుంది. ఇటీవలే షెడ్యూల్ రాగా.. అప్పుడే ఆ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించేసింది.
Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ సంచలన నిర్ణయం
ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ టి.నర్సారెడ్డి పేరును ఖరారు చేసింది. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరునే ఖరారు చేస్తూ హైకమాండ్కు పంపించారు. ఆదివారం గాంధీభవన్లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఉత్తమ్ రెడ్డి సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అభ్యర్థి గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నారు.