INDIA Alliance: ఇండియాలోకి రెండు కొత్త పార్టీలు.. నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు

గురువారం జరిగిన భేటీకి 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Written By: K.R, Updated On : September 1, 2023 12:27 pm

INDIA Alliance

Follow us on

INDIA Alliance: మోదీ ప్రభుత్వాన్ని గద్ద దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి.. మరో రెండు కొత్త పార్టీలను తనలో చేర్చుకుంది.. అంతేకాకుండా సెప్టెంబర్ 30 కల్లా సీట్ల సర్దుబాటు పై తుది నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చింది. గురువారం ముంబైలో జరిగిన భేటీలో దీనికి సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ పడింది. అంతేకాకుండా శుక్రవారం కూడా సమావేశం నిర్వహించి ఒక దిశ నిర్దేశం చేయాలని కూటమిలోని నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. అయితే శుక్రవారం జరిగే సమావేశంలో కూటమికి కన్వీనర్ ఉండాలా వద్దా? సీట్ల షేరింగ్ పై సబ్ గ్రూపులు ఏర్పాటు చేయాలా? అనే అంశాలతో పాటు విపక్షాలన్నీ కలిసి చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాల గురించి, కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పన పై శుక్రవారం జరిగే భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

28 పార్టీలు..

గురువారం జరిగిన భేటీకి 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుది నిర్ణయం ఆధారంగా అన్ని పార్టీల రాష్ట్ర కమిటీలు సీట్ల సర్దుబాటు ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించారు. ఇక శుక్రవారం భేటీ అనంతరం కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన 11 మంది నేతలతో కోఆర్డినేషన్ కమిటీని ప్రకటించడంతోపాటు, కూటమి లోగోను ఆవిష్కరించే అవకాశం ఉంది.” ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే మేము చేతులు కలిపాం. అధికార భారతీయ జనతా పార్టీని గద్దధించేందుకు అవసరమైన ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. దేశ సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేసి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత మాపై ఉంది” అని ఇండియా కూటమిలోని నేతలు పేర్కొంటున్నారు. గురువారం నాటి బీటికి హాజరైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగం, రైతుల సంక్షేమం విషయంలో విఫలమైందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా అందుకే మేము చేతులు కలిపామని ఆయన వివరించారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై విపక్షాల మొత్తం ఒకే అభ్యర్థిని నిలబెడతాయన్నారు. దేశంలో సమాఖ్య భావన ప్రమాదంలో పడిందని, బిజెపి యేతర పాలిత రాష్ట్రాలను కేంద్రం తీవ్రంగా వేధిస్తోందని ఆయన విమర్శించారు. ఇండియా కూటమిని బిజెపి ద్వేషించడమే కాకుండా.. ఎక్కడ విజయం సాధిస్తుందని భయపడుతోందని, ఇండియా అనే పదాన్ని ద్వేషిస్తూ చివరికి ఆ పదాన్ని ఉగ్రవాద సంస్థల పేర్లతో పోలుస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా మండిపడ్డారు.

కీలక నేతల ముచ్చట్లు

శుక్రవారం నాటి బీటికి ముందు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శివసేన పార్టీ ఉద్ధవ్ వర్గం నేతలు ఆదిత్య, సుప్రియ సూలే, జయంత్ పాటిల్ తో ముచ్చటించారు. మరోవైపు ఉద్దవ్, ఎన్ సీపీ అధినేత శరద్ పవార్ తో కాసేపు మాటలు కలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి.. పలివురు సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడారు. ఇండియా కూటమిలో ఇన్నాళ్లుగా 26 పార్టీలు ఉన్నాయి. గురువారం నాటి భేటీలో మరో రెండు పార్టీలు కొత్తగా హాజరయ్యాయి. వాటిలో ఒకటి పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, మహారాష్ట్రలోని మార్క్సిస్ట్ పొలిటికల్ పార్టీ. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అస్సాం జాతీయ పరిషత్, రైజోర్ దళ్, ఆంచలిక్ గణ్ మంచ్ భుయాన్ కూడా ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తికరంగా ఉన్నాయని తెలుస్తోంది.