2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి భారత్ పర్యటనకు వస్తున్నారు. ఇవాంకా కూడా తన తండ్రితో పాటు ఇండియాకు రానున్నారు. ట్రంప్ దంపతులు,అమెరికా దేశ అందాల రాశి ఇవాంకా ఢిల్లీ, ఆగ్రా అహ్మదాబాద్ ప్రాంతాలలో పర్యటించనున్నారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నారంటే ఇది దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఈ పర్యటనలో భారత్-అమెరికా దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందుకు తగినట్లుగానే ఒప్పందాల విషయమై ట్రంప్ స్పందించారు. లాస్ వెగాస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ “భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎవరూ వూహించని ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంటాం” అని వ్యాఖ్యానించారు. ఈ మాటతో ఆ ఒప్పందం ఏమైఉంటుందా.. అని యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
గతంలో మాజీ భారత ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ల మధ్య జరిగిన అణుఒప్పందం తర్వాత ఇప్పటి వరకు భారీ ఒప్పందం భారత్-అమెరికాల మధ్య ఏవీ జరగలేదు. అంతేకాకుండా భారత్-అమెరికాల మధ్య అణుఒప్పందం జరగడంతో ప్రపంచదేశాలకు భారత్ అణుశక్తిగా ఎదుగుతోందన్న సంకేతాలు వెళ్లాయి. కానీ అలా జరుగలేదు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్) విడుదల చేసిన వాస్తవిక పట్టిక ప్రకారం భారత్ అమెరికా దేశాల మధ్య వస్తు సేవా రంగంలో 1999 నుంచి 2018వరకు వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. 1999లో 16 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2018 నాటికి అది 142 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం వస్తువులు సేవల రంగంలో అమెరికా భారత్ల భాగస్వామ్యం ఎనిమిదో స్థానంలో నిలిచింది.
గతంలో జరిగిన అణు ఒప్పందాలకు భిన్నంగా కొత్తగా ఇరు దేశాల మధ్య జరుగబోయే ఒప్పందానికి అమెరికా, భారత్ లు స్పందించి సత్ఫలితాలను ఇవ్వాలని కోరుకుందాం..