Toll Plaza Toilets Dirty: మనదేశంలో ఒకప్పటితో పోల్చి చూస్తే ఇప్పుడు హైవేల సంఖ్య పెరిగిపోయింది. ప్రతి జిల్లాను ఏదో ఒక హైవే తాకూతూ వెళ్తోంది. కొన్ని జిల్లాల్లో అయితే ఒకటికి మించిన రహదారులు ఉన్నాయి. వీటిల్లో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసిన టోల్ ప్లాజా లో ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా మూత్ర శాలలు కూడా ఉంటాయి. ఎందుకంటే చెల్లించే టోల్ లో మూత్ర శాలల ఫీజు కూడా ఉంటుంది. కాకపోతే టోల్ నిర్వాహకులు మూత్రశాలల నిర్వహణను సరిగా పట్టించుకోరు. దీంతో చాలామంది ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో ముక్కు మూస్కుని పని కానిచ్చి వెళ్తారు. ఇటీవల కాలంలో ప్రయాణికులనుంచి ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది.
జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ తెలిపిన ప్రకటన ప్రకారం ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఉన్న మూత్రశాలలు అత్యంత మురికిగా ఉంటే చర్యలు తప్పవు. వెంటనే మూత్రశాల ఫోటో తీసి.. రాజమార్గ యాత్రలో అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. వెంటనే మీ ఫాస్టాగ్ ఎకౌంట్లో 1000 రూపాయలను నేషనల్ హైవే అథారిటీ జమ చేస్తుంది. అయితే మీరు టోల్ ప్లాజా వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ఆక్టివేట్ అవుతుంది. దీనికోసం నేషనల్ హైవే అథారిటీ ఏకంగా జియో ఫెన్సింగ్ అనే ఆప్షన్ అందుబాటులో తీసుకొచ్చింది.
టోల్ ప్లాజాల వద్ద మూత్రశాలలు మురికిగా ఉంటున్నాయని ఇటీవల కాలంలో ప్రయాణికులనుంచి ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారి పరిశీలనలో కూడా ఇదే తేరింది. వాస్తవానికి ప్రయాణికులనుంచి ఫీజు వసూలు చేస్తున్నప్పుడు కచ్చితంగా టోల్ ప్లాజా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మూత్రశాలలను శుభ్రంగా ఉంచాలి. కానీ వాటిని టోల్ ప్లాజా నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా దుర్గంధంగా వదిలేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే నీరు కూడా సరిగ్గా రావడం లేదు. దీంతో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. ఇక ఆడవాళ్ళ పరిస్థితయితే మరింత దారుణంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఆడవాళ్లు చవిచూస్తున్న నరకం మామూలుగా ఉండడం లేదు. అందువల్లే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
వెయ్యి రూపాయల అపరాధ రుసుము విధించడం ద్వారా టోల్ ప్లాజా నిర్వాహకులలో జవాబుదారీ తన పెరుగుతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ప్రయాణికులనుంచి ఫీజు వసూలు చేసినప్పుడు.. కచ్చితంగా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత టోల్ ప్లాజా నిర్వాహకుల మీద ఉందని హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులు పెరిగిపోయిన నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇకపై టోల్ ప్లాజా నిర్వాహకులు మూత్రశాలల నిర్వహణను సక్రమంగా చేపడతారని ఆశిస్తున్నట్టు నేషనల్ హైవే అథారిటీ అధికారులు చెబుతున్నారు.