Telangana Congress: కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి రైతులు, పేదలకు అండగా నిలిచిన పార్టీ. రైతు రుణమాఫీ దేశ వ్యాప్తంగా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఉచిత విద్యుత్ తొలిగా అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అసలు రైతన్న, నేతన్న, మహిళలు, దళితులు, బీసీలు ఎవరి గురించి అయినా ఆలోచన చేసేదీ, అభ్యున్నతికి పని చేసింది కాంగ్రెస్ పార్టీనే. అన్నివర్గాల కోసం కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే కాపీ కొడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ చేయలేనిది, తాను చేసింది ఏంటో చెప్పలేని నిస్సహాయత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మభ్య పెట్టే మాటలు, ప్రచార ఆర్భాటాలు మినహా కేసీఆర్ ఏం చేశారు?. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది.. చేసేదే చెబుతుంది.
సంక్షేమానికి బాటలు..
కాంగ్రెస్ ఫిలాసఫీలోనే రైతు సంక్షేమం ఉంది. కాంగ్రెస్ విధానంలోనే పేదల అభ్యున్నతి కనిపిస్తుంది. కాంగ్రెస్ నినాదమే దళితుల అభివృద్ధి. రైతులకు ఉచిత కరెంట్పై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో ఎగిరెగిరి పడుతోంది.
సవాళ్లు స్వీకరణకు వెనుకడుగు..
తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుతోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 24 గంటల కరెంటు ఇస్తే రాజీనామా చేస్తామని సవాళ్లు చేస్తున్నారు. కానీ, స్వీకరించే సాహసం బీఆర్ఎస్ చేయడం లేదు. నేతల నోట సమాధానం లేదు. దుక్కి దున్నటానికి రైతలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్. రైతులకు సీలింగ్ యాక్ట్ కింద భూమిని పంచింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనే కాంగ్రెస్ సీఎంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేశారు.
కాంగ్రెస్కు ఎవరూ సాటిరారు..
రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్కు ఎవరూ పోటీ కాదు..సాటి రాలేరు. కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే తప్పని పరిస్థితుల్లో అమలు చేస్తూ తన గొప్పతనంగా ప్రచారం చేసుకుంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ నినాదమే గరీబీ హఠావో. దేశంలో పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. నాడు పంచిన భూములకు నేడు పట్టాలు ఇచ్చి అంతా మేమే చేశాామని గొప్పలు చెప్పుకొనే దీన స్థితిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మహిళలు, దళితులు, విద్యార్ధుల సంక్షేమానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన స్కీంలే నేటికి అమలు అవుతున్నాయి. పేదలకు ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యం అందించటం కాంగ్రెస్ విధానం. విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ కాంగ్రెస్ కమిట్మెంట్. ఇవి కొనసాగించక తప్పని పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వానిది.
దళితులకిచ్చిన హామీపై వెనక్కి..
దళితుడిని తెలంగాణకు సీఎం చేస్తాను.. అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి ఆ హామీ నెరవేర్చకపోగా.. మాట తప్పినా ప్రజలు మమ్మల్నే గెలిపించారని అహంకారంగా మాట్లాడడం కేసీఆర్కే చెల్లింది. ఇక బీసీలకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు. బీసీలకు సబ్సిడీ రుణాల పథకం నిలిచిపోయింది.. కాదు నిలిపివేసిన ఘనత కూడా కేసీఆర్దే. కాంగ్రెస్ హయాంలో ఏటా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు సబ్సిడీ రుణాలు అందించేది. బీసీలను ఓట్ బ్యాంక్ గా వినియోగించుకోవటంలో ముందుండే కేసీఆర్ వారికి రాజకీయ ప్రాధాన్యత, ఎదిగేందుకు తోడ్పాటు ఇవ్వడంలో మాత్రం ముందు ఉండరు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి దళితులు, బీసీలు కేసీఆర్కు గుర్తుకు వచ్చారు. దళిత బంధు పేరుతో ఎన్నికల రాజకీయం ప్రారంభించారు. బీసీలకు రుణాల పేరుతో మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నా.. రైతులకు చేస్తామని చెప్పిన రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదు. కేసీఆర్ చెప్పారంటే చేయరంతే. సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్. రైతుకు నాడు..నేడు ఏనాడైనా అండగా నిలిచేది కాంగ్రెస్.