Homeజాతీయ వార్తలుBandi Sanjay Praja Sangrama Yatra: రాజకీయ మార్పే లక్ష్యంగా ‘బండి’ ప్రజాసంగ్రామ యాత్ర

Bandi Sanjay Praja Sangrama Yatra: రాజకీయ మార్పే లక్ష్యంగా ‘బండి’ ప్రజాసంగ్రామ యాత్ర

టార్గెట్ ఫిక్స్ అయ్యింది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ‘యాత్ర’ మొదలైంది. ‘బండి’ మొదలు పెట్టిన ఈ పాదయాత్రకు తొలిరోజు అద్భుతమైన స్పందన వచ్చింది. జనం , కార్యకర్తలు నీరాజనాలు పలికారు. లక్ష్యం కూడా ఒక్కటే. తెలంగాణలో అధికారంలోకి రావడం.. కేసీఆర్ ను అధికారంలోంచి దించడమే ధ్యేయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అడుగులు పడ్డాయి.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని బండి సంజయ్ తీవ్ర విమర్శలు మొదలుపెట్టారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర శనివారం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కుటుంబ, అరాచక, అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కష్టాల్లో ఉన్న ప్రజలకు బీజేపీ అండగా ఉందని చెప్పడానికే యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తామని.. వారు పట్టించుకోకుంటే ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం సంక్షేమ పథకాలను యాత్రలో ప్రజలకు వివరించి వారి ఆశీర్వాదం కోరుతామన్నారు. తెలంగాణ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకే సంగ్రామ యాత్రను చేపట్టామని తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగుతామని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుటుంబంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా మూర్ఖపు పాలన కొనసాగుతోందని’ ఆరోపించారు.

తెలంగాణలోని 90శాతం మంది హిందువులను కాపాడే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని దళితులను దళితబంధు పేరుతో.. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ భరోసా నింపడానికి, వారికి అండగా ఉండటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని ఎంపీ బండి సంజయ్ అన్నారు.

ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం మాట్లాడారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలని అన్నారు. రెండు కుటుంబాలు తెలంగాణను శాసిస్తున్నాయని.. అమలు కాని హామీలతో ప్రజలను మభ్య పెడుతున్నారని.. బంగారు తెలంగాణను మాఫియా తెలంగాణగా మార్చేశారని దుయ్య బట్టారు. బీజేపీ సునామీలో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి నెలకొందని ఆరోపించారు.

యాత్ర ప్రారంభానికి ముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్ సింగ్, లక్ష్మణ్ తో కలిసి బండి సంజయ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

*తొలిరోజు బండి సంజయ్ పాదయాత్ర ఇదీ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. తొలిరోజు పాదయాత్ర అప్ఘల్ గంజ్, నాంపల్లి, లక్డీకపూల్ మీదుగా మెహదీపట్నం వరకు 10 కి.మీల మేర సాగుతుంది. శనివారం రాత్రి మెహదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బండి సంజయ్ బస చేస్తారు. నాలుగు విడతల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular