తిరుపతి ఉప ఎన్నిక ముంగిట ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ నేత అచ్చెన్నాయుడి వీడియో టేపుల వ్యవహారం.. ఆ పార్టీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది. అంతర్గతంగా నెలకొన్న పరిస్థితి బహిర్గతమవడంతో.. అందరి ముందూ పార్టీ పరువు పలుచనైపోయింది. ఇక, భావి అధినేతగా చెప్పుకునే లోకేష్ ను దుర్భాషలాడటం కూడా శ్రేణుల్లో కలకలం రేపింది. దీంతో.. లోకేష్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
నిజానికి లోకేష్ – అచ్చెన్నాయుడికి ముందు నుంచీ పొసగలేదనే గుసగుసలు ఉన్నాయి. ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కూడా లోకేష్ వ్యతిరేకించారనే ప్రచారం సాగింది. అచ్చెన్నకు బదులుగా.. రవిచంద్రయాదవ్ కు ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం. కానీ.. చంద్రబాబు సర్దిచెప్పారట. ఉత్తరాంధ్రలో పార్టీ బలపడాలంటే బలమైన నేత కావాలని, అధికారం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆచితూచి వ్యవహరించాలని చెప్పారట. దీంతో.. ఇష్టం లేకున్నా లోకేష్ అంగీకరించినట్టు తెలిసింది.
అయితే.. ఇప్పుడు పార్టీపై కామెంట్ చేయడమే కాకుండా, తనను కూడా దుర్భాషలాడటంపై సీరియస్ ఉన్నారట లోకేష్. ఈ వీడియో వ్యవహారం కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఫీలవుతున్నారట. అందువల్ల అచ్చెన్నపై యాక్షన్ తీసుకోవాల్సిందేనని తండ్రికి గట్టిగా సూచించారని సమాచారం.
రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవ్వరికైనా ఇవ్వండి కానీ.. అచ్చెన్నాయుడిని మాత్రం తీసేయాల్సిందేనని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఆయనకు బదులు రామ్మోహన్ నాయుడుకు ఇచ్చినా కూతా తన అభ్యంతరం లేదని, అచ్చెన్న మాత్రం పదవిలో ఉండడానికి వీళ్లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం.
దీంతో.. చంద్రబాబు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో అచ్చెన్నను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. అయితే.. నేరుగా వేటు వేస్తున్నట్టు కాకుండా.. ఆయనతోనే రాజీనామా చేయిస్తారని అంటున్నారు. మరి, ఏం జరుగుతుంది? అన్నది చూడాలి