మొన్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు బాహాటంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు దేశం పార్టీని ఇక ఎవ్వరూ కాపాడలేరని ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. దీనికి కారణాలు కూడా చెప్పేశాడా తెలుగు తమ్ముడు. చందరబాబు మాట మీద నిలబడే రకం కాదని, చెప్పే మాట ఒకటి.. చేసేది మరొకటి అని కామెంట్స్ చేసినట్టు సమాచారం.
నిన్నటికి నిన్న చంద్రబాబు సంస్థానం.. కుప్పం నియోజకవర్గంలో క్యాడర్ ముక్త కంఠంతో ఇదే మాట అన్నారట. ఏకంగా బహిరంగ సభలోనే బాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇక్కడ చంద్రబాబు దశాబ్దాలుగా తిరుగులేని విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇప్పుడు తమ్ముళ్లు బాబును ఇక దిగిపోండని చెబుతున్నారట.
చంద్రబాబును ఇన్నాళ్లూ పల్లెత్తు మాట అనకుండా చూసుకున్న తమ్ముళ్లు.. ఇక చాలు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. ఒక్క చోట కాకుండా.. పలు చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుండడంతో.. చంద్రబాబు పరిస్థితి ఏంటనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీకి.. సొంత కార్యకర్తల నుంచే ఇలాంటి కామెంట్లు వస్తుండడం ఖచ్చితంగా ఇబ్బందికరమే.
ఓ వైపు అధికార పక్షం నుంచి భీకరమైన దాడి కొనసాగుతోంది. దాన్ని ఎదుర్కొనేందుకు పార్టీ నానా అవస్థలు పడుతోంది. ఇలాంటి టైమ్ లో తమ్ముళ్ల నుంచే ఇలాంటి అభిప్రాయం వ్యక్తమవడం బాబుకు మింగుడు పడనిది. మరి, ఈ పరిస్థితిని ఎలా డీల్ చేస్తారు? మళ్లీ తమ్ముళ్లలో విశ్వాసాన్ని ఎలా నింపుతారు? అన్నదే అతి పెద్ద సవాల్.