Site icon OkTelugu

Mudragada – TDP : నాటి ముద్రగడ ట్రెండ్.. నేటి టీడీపీ విధానం

mudragada tdp

mudragada tdp

Mudragada – TDP : ‘ట్రెండ్ అందరూ ఫాలో అవుతారు.. కానీ ట్రెండ్ కొంత మంది మాత్రమే సెట్ చేస్తారు. సినిమాల్లో రాజకీయాల్లో మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేయడంలో దిట్టగా పేరొందారు. కానీ రాజకీయాల్లో వృద్ధ కాపు నేత ముద్రగడ పద్మనాభం సైతం తన కాపు ఉద్యమం కోసం ఎన్నో కొత్త కొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. కాపులను ఏకం చేశారు. కాపులకు రిజర్వేషన్ కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. కొన్ని దశాబ్ధాలుగా ముద్రగడ కాపులకు హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ పోరాటం కొనసాగుతోంది.

గత చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్ కోసం ముద్రగడ చేసిన ఉద్యమం పతాకస్థాయికి చేరింది. తెనాలిలో రైలుకు నిప్పు, ముద్రగడ ఉద్యమంతో పచ్చటి గోదావరి జిల్లాలు భగ్గుమన్నాయి. ఏపీ వ్యాప్తంగా కాపుల్లో రిజర్వేషన్ల కోసం బయటకొచ్చి నిరసన తెలిపారు. నాడు కాపు ఉద్యమంలో కాపులంతా కూడా ఆ సమయంలో ఇంట్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్నా, ఇతర పనుల్లో, ప్రాంతాల్లో ఉన్నా… ఒక్క 5 నిముషాల పాటు గంట కొట్టడం, విజిల్ వేయడం, హారన్ కొట్టడం, ప్లేట్ల ను కొడుతూ చప్పుడు చేయాలని పిలుపునిచ్చారు.

కాపు ఉద్యమంలో ముద్రగడ అవలంభించిన ప్లేట్లను కొట్టే చప్పుడు లాంటి నిరసనలు ఇప్పటివరకూ ఎవ్వరూ అనుసరించలేదు. ఇలా ఇంట్లో ఉండి కూడా తమ నిరసనను కాపులు తెలియజేయవచ్చని చాలా అద్భుతంగా నిరూపించారు. కాపులను ఏకతాటి పైకి తేవడంలో ముద్రగడ ఉద్యమ స్ట్రాటజీలు చాలా పనిచేశాయి.

అయితే ట్రెండ్ సెట్ చేసింది ముద్రగడ అయితే ఇప్పుడు దాన్ని కాపీ కొడుతున్నది టీడీపీ కావడం గమనార్మం. తాజాగా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలుపాలని పార్టీ అధిష్టానం తాజాగా పిలుపునిచ్చింది. ఆశ్చర్యకరంగా కాపు ఉద్యమంలో ముద్రగడ అమలు చేసిన నిరసన కార్యక్రమాలనే ఇప్పుడు తాజాగా ప్రకటించడం అందిరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగిద్దాం! పేరుతో 5 నిముషాల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని తెలుగు దేశం పార్టీ తలపెట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30 తేదీ రాత్రి 7 గంటల నుంచి 7 గంటలా 5 నిముషాల వరకు(సరిగ్గా 5 నిముషాల పాటు) 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా శబ్దంచేసి చంద్రబాబు నాయుడుకు మద్దతు పలకాలని ఆ ప్రకటనలో అచ్చెన్నాయుడు కోరారు. ప్రజలు ఆ సమయంలో ఇంట్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్నా, ఇతర పనుల్లో, ప్రాంతాల్లో ఉన్నా…ఒక్క 5 నిముషాల పాలు గంట కొట్టడం, విజిల్ వేయడం, హారన్ కొట్టడం, ప్లేట్ల ను కొడుతూ చప్పుడు చేయాలని పిలుపునిచ్చారు. 5 నిముషాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేస్తోంది కక్ష పూరిత రాజకీయాలని మోత మోగేలా చాటి చెప్పాలని అచ్చెనాయుడు కోరారు. సామాన్య ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అచ్చెన్నాయుడు విజ్ఝప్తి చేశారు.

ఇది నాడు ముద్రగడ అమలు చేసిన ఉద్యమ స్ట్రాటజీ నిరసన అని.. దాన్ని ఇప్పుడు టీడీపీ కాపీ కొడుతోందని నెటిజన్లు, కాపు ఉద్యమకారులు, కాపు యువత గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ ఎప్పుడూ క్రియేటివ్ గా ఆలోచించదని.. ప్రతీ దాన్ని కాపీ కొడుతారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా నాటి కేసీఆర్ సర్కార్ పథకాలనే కాపీ కొట్టి పేరు మార్చి అమలు చేశారు. ఇక ఇటీవల కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ఏజెండానే అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆయన పార్టీ కూడా కొత్తగా ఆలోచించకుండా ముద్రగడ ఉద్యమ నిరసనను కాపీ కొట్టిందని పలువురు ఉదాహరణలతో సహా ఏకిపారేస్తుండడం విశేషం.
Recommended Video:

Exit mobile version