తాలిబన్లు పటిష్టమైన వ్యూహంతో రంగంలోకి దూకినట్లు తెలుస్తోంది. వేలాది మంది తాలిబన్లు పంజ్ షేర్ ను చేజిక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. అన్ని ప్రాంతాలపై విరుచుకుపడుతున్నారు. తాలిబన్లను కట్టడి చేయడం ఎన్ఆర్ఎఫ్ బలగాలకు సాధ్యం కావడం లేదని సమాచారం. పంజ్ షేర్ పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటన విడుదల చేశారు. పంజ్ షేర్ చివరికి తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
పంజ్ షేర్ పై తాలిబన్ల యుద్ధం కొనసాగుతోంది. ఎన్ఆర్ఎఫ్ అధికార ప్రతినిధి ఫహీమ్ దస్తీ ప్రాణాలను తాలిబన్లు పొట్టనపెట్టుకున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్ లో కీలక నేతల్లో ఒకరిగా పేరున్న అబ్దుల్లా మేనల్లుడే ఆయన. అహ్మద్ మసూద్ కు సన్నిహితుడు. మరో కీలక నేత అబ్దుల్ వదూద్ ఝోర్ ను కూడా తాలిబన్లు హత్య చేసినట్లు ఎన్ఆర్ఎఫ్ ట్విటర్ వేదికగా తెలిపింది. దీంతో తాలిబన్ల పోరు కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది.
తాలిబన్ల ప్రకటనను ఎన్ఆర్ఎఫ్ కమాండర్ అహ్మద్ మసూద్ ఖండించారు. చివరి రక్త బొట్టు వరకు తాలిబన్లతో పోరాడుతూనే ఉంటామని చెబుతున్నారు. దేశ ప్రజలందరు తాలిబన్ల ఆగడాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఫేస్ బుక్ వీడియో సందేశాన్ని మసూద్ పోస్టు చేశారు. పంజ్ షేర్ లో ఎన్ఆర్ఎఫ్ బలగాలు ఇంకా పోరాడుతున్నాయని తెలుస్తోంది. దేశమంతా తాలిబన్ల పై విప్లవబాట పట్టాలని పిలుపునిచ్చారు.