తెలంగాణలో ఇప్పటి వరకూ ఇలాంటి ఉప ఎన్నిక జరగలేదంటే అతిశయోక్తి కాదు. హుజూరాబాద్ ఎన్నిక అటు ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ కు ఎంత కీలకమో.. ప్రభుత్వ మనుగడ సాఫీగా సాగడానికి కూడా అంతే అవసరమని చెప్పొచ్చు. దీంతో.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య హోరాహోరీగా పోరాటం సాగుతోంది. మధ్యలో రేసులోకి వచ్చిన కాంగ్రెస్.. తన బలం నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో.. హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారు? అని చెప్పడం కష్టతరంగానే తయారైంది.
దీంతో.. అసలు ఓటరు నాడి ఏంటీ? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అనే వివరాలు తెలుసుకునేందుకు అందరూ హుజూరాబాద్ మీద పడ్డారు. పార్టీలు సొంతంగా సర్వే చేయించుకుంటున్నాయి. కొందరు ఇప్పటికే సర్వే అయిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇవికాకుండా.. కొన్ని మీడియా సంస్థలు, మరికొన్ని ఇతర సంస్థలు కూడా హుజూరాబాద్ ఓటరుతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యాయి. ఒక్కో సంస్థ నుంచి కనీసం వంద మంది హుజూరాబాద్ లో వాలిపోయినట్టు అంచనా. దీంతో.. ఎక్కడ చూసినా సర్వే జనాలే కనిపిస్తున్నారట.
వీళ్లంతా ఎగ్జామ్ పేపరు ఒకటి పట్టుకొని.. ప్రజలతో మల్టిపుల్ ఛాయిస్ లు టిక్ పెట్టించుకుంటున్నారట. హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? ఈటల హయాంలో అభివృద్ధి జరిగిందా? భూ కబ్జా ఆరోపణలు నిజమేనని భావిస్తున్నారా? కేసీఆర్ ను నమ్ముతున్నారా? దళిత బంధు ఉపయోగపడుతుందా? వంటి ప్రశ్నలు వేస్తూ.. ఊళ్లలో తిరుగుతున్నారట.
ఈ విధంగా హుజూరాబాద్ రాజకీయం ఇప్పుడే వేడెక్కుతోంది. ఎవరు గెలుస్తారు? అనేది అర్థంకాకుండా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ పార్టీ గెలిచినా.. కొద్ది మెజారిటీతోనే అని అంటున్నారు. దీంతో.. పార్టీలు, నేతలు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపే ఫలితం కావడంతో.. ఏం చేసైనా విజయం సాధించి తీరాలని చూస్తున్నాయి పార్టీలు.
ఇలాంటి పరిస్థితుల్లోనే కేసీఆర్ పర్యటన కూడా ఖరారైంది. ఈ నెల 16న సీఎం హుజూరాబాద్ వెళ్లబోతున్నారు. దీంతో.. పొలిటికల్ హీట్ మరింత పెరగడం ఖాయం. ఈ పర్యటనలో అభ్యర్థిని ప్రకటిస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఈటలను ఎదుర్కోవడం కేవలం గులాబీ పార్టీ గుర్తుతోనే సాధ్యం కాదని, అభ్యర్థి ఎంపిక కూడా ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, కేసీఆర్ ఎవరిని నిలబెడతారనేది చూడాలి.