TMC-NCP- CPI: తమది జాతీయ పార్టీ అని.. తాము జాతీయ చక్రం తిప్పుతామని బయల్దేరుతున్నారు కొంతమంది నేతలు. అయితే నేతలు చెప్పుకున్నంత మాత్రాన, పేపర్లలో రాయడం, టీవీ చానెళ్లలో చెప్పడం ద్వారా ఆ పార్టీలకు జాతీయ గుర్తింపు ఉన్నట్లేనా అంటే కచ్చితంగా కాదు. భారత రాజ్యాంగం ప్రకారం.. భారతీయుడు దేశంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో అయినా పోటీ చేయవచ్చు. ఆ స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అలాంటప్పుడు పార్టీ ఎందుకు.. జాతీయ గుర్తింపు ఎందుకు అంటే కామన్ సింబల్ కోసమే. పార్టీ అంతటికీ ఒక గుర్తు ఉండడం ద్వారా ప్రజల్లోకి త్వరగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ గుర్తులను ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఇక జాతీయ గుర్తింపు కూడా ఎన్నికల సంఘమే ఇస్తుంది. కానీ నాయకులు తమ పార్టీకి రెండు మూడు రాష్ట్రాల్లో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అధ్యక్ష, కార్యదర్శులను నియమించి తమది జాతీయ పార్టీ అని ప్రకటించగానే జాతీయ పార్టీ అయిపోదు. తాజాగా ఎన్నికల సంఘం మూడు పార్టీల జాతీయ గుర్తింపు తొలగించి కొత్తగా ఆప్కు జాతీయ గుర్తింపు ఇచ్చింది.
ఇవి ప్రాంతీయ పార్టీలే..
తెలుగు రాష్ట్రాల్లో తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలే అని ఈసీ స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ కూడా ప్రాంతీయ పార్టీనే అని పేర్కొంది. వీటికి జాతీయ గుర్తింపు లేదు. జాతీయ కార్యదర్శి, జాతీయ అధ్యక్షుడు అనేది కేవలం పత్రికల్లో రాసుకోవడానికి మాత్రమే. ఆవిషయం మరోమారు ఈసీ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలోనే రిజిస్టర్ అయింది. దీంతో ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్ర పార్టీగా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఎన్నికల సంఘం బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు రద్దు చేసింది. బీఆర్ఎస్ కేవలం ప్రాంతీయ పార్టీ అని ప్రకటించింది. అదే సమయంలో టీడీపీ కూడా ప్రాంతీయ పార్టీనే అని స్పష్టం చేసింది. టీడీపీ రెండు రాష్ట్రాల్లో పోటీచేసి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేసిన దాఖలాలు కూడా లేవు.
జాతీయ హోదా కోల్పోయిన మూడు పార్టీలు..
ఇక నిన్నటి వరకు జాతీయ పార్టీలుగా ఉన్న ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తాజాగా జాతీయ గుర్తింపు కోల్పోయాయి. కొన్నేళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీలకు నిబంధనల మేరకు ఓట్ల శాతం రావడం లేదు. సీట్లు కూడా గెలవడం లేదు. దీంతో తాజా సమీక్షలో ఆ పార్టీల జాతీయ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ హోదా ప్రకటించింది. ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉండడంతోపాటు, గుజరాత్లో 6 శాతానికిపైగా ఓట్లు సాధించడం, గోవాలో సీట్లు గెలుచుకోవడంతో ఆప్కు జాతీయ హోదా దక్కింది.
ఇక దేశవ్యాప్తంగా కొన్ని పార్టీలు ప్రాంతీయ హోదా కూడా కోల్పోయాయి. రెండు పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. ప్రతీ ఎన్నికలకు ముందు ఈసీ జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాను ప్రకటించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే తాజా ప్రకటనను ఈసీ విడుదల చేసింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More