Telangana Assembly Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 40 రోజులు మాత్రమే గడువు ఉంది. బీఆర్ఎస్ రేసులో దూసుకుపోతోంది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉండగా, మూడో స్థానంలో కమలం పార్టీ ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు తయారు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 55 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. దీంతో తొలి జాబితాలో టికెట్ రానివారు, తమకు కాకుండా ఇతరులకు టికెట్ రావడంతో ఆశ వహులు పక్కచూపులు చూస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి బంగపడ్డవారు, అసంతృప్తులు కూడా కాంగ్రెస్, బీజేపీవైపు చూస్తున్నారు. దీంతో అన్ని పార్టీల్లో వలసలు కొనసాగుతున్నాయి. ఓ పార్టీలో ఒకరు రాజీనామా చేస్తే వారి స్థానంలో మరొకరు ఇతర పార్టీ నుంచి చేరుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇది జరుగుతుండగా ఇప్పుడు ఊపందుకుంది.
పార్టీలు మారుతున్నారిలా..
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, ఆయన సతీమణి హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజిత గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాలను రెండు మూడుసార్లు ఖండించిన ఆయన ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసంకు చేరుకుని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
రాజకీయ నేపథ్యం ఇదీ..
జగదీశ్వర్ గౌడ్ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా గెలిచాడు. అనంతరం 2016లో మాదాపూర్ కార్పొరేటర్గా టీఆర్ఎస్ నుంచి రెండోసారి గెలుపొందారు. 2020 లో మాదాపూర్ నుంచి మూడోసారి కార్పొరేటర్గా విజయం సాధించగా హాఫిజ్పేట్ నుంచి ఆయన సతీమణి పూజిత కార్పొరేటర్గా గెలుపొందారు. ఈ రెండు డివిజన్లలో జగదీశ్వర్కు మంచి పట్టు ఉండటంతో వీరు కారు దిగడంతో బీఆర్ఎస్ పార్టీకి మాదాపూర్, హాఫిజ్పేట్లో పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు.
కాంగ్రెస్లోకి వలసలు..
బోధన్ బీఆర్ఎస్ మునిసిపల్ ౖచైర్పర్సన్ పద్మావతి శరత్రెడ్డి లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, మరి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ బీఆర్ఎస్ నేత ఆకుల లలిత కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కూడా కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.