కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. వీరికి సినీ నటులు కూడా అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో కరోనాని కట్టడి చేసే పోరులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన వంతు సాయం ప్రకటించారు. చాలా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అటు తమిళ సినీ నటులు తమ సినీ కార్మికులను ఆదుకోవడం కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటులు ఒక్కొక్కరుగా తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇక బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్.. సినిమా వాళ్లలో ఎవరికి అందనంత ఎక్కువగా రూ.25 కోట్ల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజల కోసం ఎంత ఇచ్చిన తక్కువే అంటూ తన వినమ్రతను వ్యక్తం చేసాడు. ఆయన బాటలోనే పలువురు బాలీవుడ్ తారలు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చిన తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో కింగ్ ఖాన్ షారుఖ్ కూడా కరోనా పై పోరులో తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
షారుఖ్ ఖాన్.. తన ఆధ్వర్యంలో ఉన్న రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, మీర్ ఫౌండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ సంస్థలతో పాటు కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పలు సహాయక కార్యక్రమాలు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి కట్టుగా ఈ మహామ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ముంబాయ, కోల్కతా, దిల్లీ నగరాలను ఎంచుకొని అక్కడ పేద ప్రజలను నిత్యావసరాలు అందించడానికి తన సంస్థ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరుపున పీఎం సహాయనిధికి విరాళం అందించనున్నట్టు ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రెడ్ చిల్లీస్ తరుపున విరాళం ప్రకటించారు. ఐతే.. షారుఖ్ విరాళం ఎంత అనేది ప్రకటించలేదు. అంతే కాకుండా కోల్కతా నైట్ రైడర్స్, మీర్ ఫౌండేషన్ తరుపున పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో కరోనాపై పోరులో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి 50 వేల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ను అందివ్వనున్నట్టు ప్రకటించారు.
ముంబై మురికివాడల్లో ఉన్న 5 వేలకు పైగా ఫ్యామిలీస్ కు మీర్ ఫౌండేషన్,ఏక్నాథ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి నెల రోజుల పాటు భోజనం అందించే ఏర్పాట్లు చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు హాస్పిటల్స్, ఇళ్ల వద్ద భోజన సదుపాయం లేనివాళ్లకు 2 వేల మీల్స్ అందించేందుకు ఓ కిచెన్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాదు ముంబాయిలోని రోటీ ఫౌండేషన్ తో కలిసి మీర్ ఫౌండేషన్తో కలిసి 3 లక్షల భోజన కిట్లను 10 వేల మందికి పంపిణి చేయనున్నారు. అంతే కాకుండా 2500 మంది కుటుంబాలకు రోజు కూలీ చేసుకునే వాళ్లకు నిత్యావసర సరుకులు అందివ్వనున్నట్టు ప్రకటించారు.