కరోనా దెబ్బతో కళావిహీనంగా మారిన బడి!

  మాయదారి కరోనా దెబ్బతో రాష్ట్రంలో కోవిద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ బడులు ఒక్కొక్కటిగా మూతపడుతూ… వస్తున్నాయి.‘‘ఇక పాఠశాలలను మేము నడపలేం బాబోయ్‌’’ అంటూ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే తాము లక్షలాది రూపాయల నష్టాన్ని మూటగట్టుకున్నామని.. మళ్లీ బడులు తెరిచి మరింత ఆర్థిక భారాన్ని మోయలేమంటూ వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో గత ఏడాది ఇదే సమయానికి కళకళలాడిన  పాఠశాలలు.. ఇప్పుడు కళావిహీనంగా మారాయి. ప్రార్థన గీతాలు, తరగతి […]

Written By: Neelambaram, Updated On : July 21, 2020 4:06 pm
Follow us on

 

మాయదారి కరోనా దెబ్బతో రాష్ట్రంలో కోవిద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ బడులు ఒక్కొక్కటిగా మూతపడుతూ… వస్తున్నాయి.‘‘ఇక పాఠశాలలను మేము నడపలేం బాబోయ్‌’’ అంటూ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే తాము లక్షలాది రూపాయల నష్టాన్ని మూటగట్టుకున్నామని.. మళ్లీ బడులు తెరిచి మరింత ఆర్థిక భారాన్ని మోయలేమంటూ వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో గత ఏడాది ఇదే సమయానికి కళకళలాడిన  పాఠశాలలు.. ఇప్పుడు కళావిహీనంగా మారాయి. ప్రార్థన గీతాలు, తరగతి గదుల్లో పిల్లల సందడి కరువై బావురుమంటున్నాయి. కరోనా వైరస్‌ రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. కంటికి కనిపించని వైర్‌స ను ఎదుర్కొని నిలబడేందుకు ప్రజలందరూ పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ పూర్తిగా కుదేలయ్యాయి. కొంతమంది చేసేదేమీ లేక వ్యాపారాలను వదులుకుని.. ఇతర రంగాల వైపు వెళ్తున్నారు. ఇప్పుడు అదే దారిలో ప్రైవేట్‌ పాఠశాలల యజమానులు నడుస్తున్నారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు సుమారు 11వేల వరకు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే సుమారు 5,526 బడులు ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో అనధికారికంగా మరో 6వేల ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 33లక్షల మంది చదువుతుండగా, 3.5 లక్షల మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన బడుల్లోనే 16.05 లక్షల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు.

వైరస్‌ ప్రభావంతో మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా మూసివేయడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఏప్రిల్‌ రెండో వారంలో వార్షిక పరీక్షలు నిర్వహించి విద్యార్థుల నుంచి రావాల్సిన పెండింగ్‌ ఫీజులు వసూలు చేసుకోవాల్సిన తరుణంలో వైరస్‌ కారణంగా బడులన్నీ అనివార్యంగా మూతపడ్డాయి. దీంతో ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలకు సుమారుగా రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి.

ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని 5,526 బడులే దాదాపు రూ.260-280 కోట్ల వరకు నష్టపోయాయి. కొన్ని యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పెండింగ్‌ ఫీజులు వసూలు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కానరాలేదు. కేవలం 15 శాతం మంది బకాయిలు చెల్లించగా, మిగతా 85శాతం మంది డబ్బుల్లేవని చేతులెత్తేశారు. మార్చి 16 నుంచి బడులను మూసివేయడంతో తమ వద్ద పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా చాలా యాజమాన్యాలు వేతనాలు చెల్లించలేదు. కేవలం కొన్నిస్కూళ్లు మాత్రమే మార్చి, ఏప్రిల్‌ నెల వేతనాలు అందజేశాయి.