Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy: ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి ఆయన ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు గానీ.. మాటల గారడీ చేయగల నేర్పరి. ప్రభుత్వం తప్పునకు దొరికిన ప్రతీసారి ఆయన ఎదురు దాడి చేస్తుంటారు. చాలా రకాల లాజిక్కులు మాట్లాడుతుంటారు. అదంతా చంద్రబాబు చేసిన ఫలితమేనని చెబుతుంటారు. ఇప్పుడు దొంగ ఓట్ల నమోదు, ఎన్నికల కమిషన్ యాక్షన్ లోకి దిగడం సైతం చంద్రబాబు చలువేనని సెలవిస్తున్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసును తీసుకుందాం.ఆ సమయంలో సజ్జల చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ దొంగ ఓట్లు విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం.. మరికొందరి పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చివరికి ఇది జగన్ సర్కార్ మెడకు చుట్టే అవకాశం ఉండడంతో సజ్జల స్పందించారు. అదే స్పీడ్ తో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదంతా చంద్రబాబు చేస్తున్న పనేనంటూ చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు టక్కు టమారా విద్యలు తెలుసు. వ్యవస్థల్ని ఇట్టే మేనేజ్ చేయగలరు. వైసిపి ఓట్లు తొలగించింది ఆయనే. ఇప్పుడు దొంగ ఓట్లు తీసేస్తే తప్పా అంటూ సజ్జల ప్రశ్నించారు. తాజా ఓట్ల తొలగింపును సమర్థించారు. అయితే సజ్జల తాజా ఆరోపణలు పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా అధికారులు బలి పశువులవుతుంటే.. గుడ్డిగా ఓట్ల తొలగింపును సమర్ధించడం ఎంతవరకు సమంజసం అని బాధిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తాము అనుకున్న 60 లక్షల ఓట్లు తొలగిస్తే..తాము అనుకున్న ఫలితం వస్తుందని సజ్జల బలంగా నమ్ముతున్నట్టు ఉన్నారు. అందుకే సమర్థిస్తున్నారు. గతంలో చంద్రబాబు దొంగ ఓట్లు నమోదు చేసి ఉంటే.. ఆ పార్టీ ఎందుకు ఓటమి చవిచూసింది. ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి చిలక పలుకులు పలుకుతుంటారు. అటు ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారో తెలియదు గానీ.. రాజకీయాల గురించి మాత్రం ఇట్టే మాట్లాడేస్తున్నారు. అక్కడ జరిగింది ఓట్ల స్కాం. స్పష్టంగా తప్పిదం కనిపిస్తోంది. ఈసీ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది. ఈసీ సీరియస్ యాక్షన్కు దిగితే అడ్డంగా బుక్కయ్యేది అధికారులే. ఇది తెలిసి కూడా సజ్జల మసి పూసి మారేడు కాయ చేయాలనే ప్రయత్నించడం మాత్రం జుగుప్సాకరంగా ఉంది.