Madhya Pradesh: దేశాన్ని కాపాడే ఆర్మీ అధికారులపై దారిదోపిడీ.. వారి స్నేహితురాళ్ల పై లైంగిక దాడి.. మధ్యప్రదేశ్లో దారుణం

ఆర్మీ మన దేశానికి రక్షణగా నిలుస్తుంది. శత్రు దేశాల నుంచి కాపాడుతూ ఉంటుంది. సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తుంటుంది. అలాంటి ఆర్మీలో పనిచేస్తున్న అధికారులకు మన దేశంలో రక్షణ లేకుండా పోయింది. పైగా వారి స్నేహితురాళ్ళ పై లైంగిక దాడి జరగడంతో సభ్య సమాజం తలదించుకుంటున్నది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 17, 2024 8:26 am

Madhya Pradesh(1)

Follow us on

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతంలో ఆర్మీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు యువ అధికారులు.. తమ స్నేహితురాళ్లతో కలిసి బయటికి వెళ్లారు. వారిపై దారి దోపిడి ముఠా దాడి చేసింది. అనంతరం యువ అధికారుల స్నేహితురాళ్ళ పై లైంగిక దాడికి పాల్పడింది. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరిపై క్రిమినల్ రికార్డు ఉందట. ఇండోర్ నగరం పరిధిలోని ఎంహౌ ఆర్మీ కాలేజీలో ఇద్దరు యువ అధికారులు శిక్షణ పొందుతున్నారు. గత మంగళవారం మధ్యాహ్నం తమ స్నేహితురాళ్ళ తో కలిసి మంగళవారం మధ్యాహ్నం చోటిజామ్ ప్రాంతంలోని ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లారు. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో సాయుధులైన ఎనిమిది మందితో కూడిన దారిదోపిడి ముఠా వారిని చుట్టుముట్టింది. ఆ సమయంలో ఆ ముఠా సభ్యుల చేతిలో తుపాకులు, కత్తులు, కర్రలు ఉన్నాయి. దీంతో ఆర్మీ అధికారులు, వారి స్నేహితురాళ్లు ఆందోళనకు గురయ్యారు. వారంతా కలిసి ఆర్మీ అధికారులపై దాడులు చేశారు.. వారి వద్ద ఉన్న డబ్బు, ఇతర వస్తువులను దోచుకున్నారు..

బంధీలుగా చేసుకొని.. అత్యాచారానికి పాల్పడి..

ఒక అధికారి, ఆమె స్నేహితురాలిని బంధీలుగా చేసుకున్నారు. మిగతా ఇద్దరిని 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన డబ్బు వెంటనే తీసుకురావాలని వారిద్దరిని వదిలిపెట్టారు. భయంతో ఆ అధికారి వెంటనే తాను ట్రైనింగ్ లో ఉన్న యూనిట్ కి వచ్చాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఆ ముఠా ఆర్మీ అధికారిని, ఆయన స్నేహితురాలిని వదిలి వెళ్ళిపోయింది. అనంతరం వారిని ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆ మహిళపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారించారు.. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఆ ముఠాలో మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లడం.. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో దోపిడి ముఠా రెచ్చిపోయింది. ముందుగా ఆ నలుగురిపై దాడి చేసింది. ఆ తర్వాత వారి వద్ద ఉన్న వస్తువులను దోచుకుంది. ప్రతిఘటించే అవకాశం లేకుండా తుపాకులను వారి కణత కు గురి పెట్టింది. ఈ నేపథ్యంలోనే వారు భయపడిపోయారు. దోపిడి ముఠా చెప్పినట్టు చేశారు. వారి వద్ద దోచుకున్న వస్తువుల విలువ దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆ వస్తువులను పోలీసుల రికవరీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.