ABN RK Vs Jagan: ఆర్కే గారి రాతలు మరీ : నా వార్తలు నా ఇష్టం.. ఇలానే ఉంటాయి మరి

తాజాగా ఆ చానల్లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంపై ఒక కథనం ప్రసారం అయింది.

Written By: Dharma, Updated On : December 27, 2023 4:47 pm

ABN RK Vs Jagan

Follow us on

ABN RK Vs Jagan: మీడియా అనేది న్యూట్రల్ గా ఉండాలి. తప్పును తప్పులాగా.. ఒప్పును ఒప్పులాగా ప్రజలకు వివరించాలి. అప్పుడే మీడియాపై ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. నాలుగవ వ్యవస్థగా పదికాలాలపాటు మన కలుగుతుంది.. కానీ ఇప్పుడు మీడియా తన విశ్వసనీయతను కోల్పోతుంది. పార్టీలకు డప్పు కొట్టే ఒక ప్రచార అస్త్రంగా మిగులుతోంది. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పత్రికలను, చానల్స్ ను ప్రారంభిస్తుండడం.. వారి ప్రయోజనానికి అనుగుణంగా వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడంతో అసలు నిజాలు అనేవి గాలికి కొట్టుకుపోయే పేల పిండి అవుతున్నాయి. ఇదే సమయంలో మేము బురద చల్లుతాం.. కడుక్కోవడం మీ వంతు అనేలాగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మీడియా అంటేనే ప్రజల్లో ఏవగింపు కలిగే పరిస్థితులు దాపురిస్తున్నాయి.

తెలుగు నాట ఒక పార్టీకి డప్పు కొట్టే ఓ ఛానల్.. వార్తల ప్రసారం విషయంలో ఎటువంటి నిబంధనలు పాటించదు. ఆ పార్టీ అనుకూలమైన వార్త అయితే చాలు పెద్ద బొంబాట్ చేస్తుంది. ఇక అందులో పని చేసే వ్యాఖ్యలు అయితే భారీ లెవెల్ లో వార్తలను ప్రజెంట్ చేస్తారు. అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ ఏది చెప్తే అది చేస్తారు కాబట్టి వారిని తప్పు పట్టడానికి లేదు. కానీ వార్తను ప్రజెంట్ చేసే విషయంలో ఆ మేనేజ్మెంట్ ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదు. ఇంతకీ జరుగుతున్న చర్చ ఏంటయ్యా అంటే..ఆ చానెల్ లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆయన పీల్చే గాలి నుంచి వేసే అడుగు వరకు ప్రతి విషయంలోనూ ఆ ఛానల్ నెగటివ్ కోణాన్నే చూస్తూ ఉంటుంది. ఆ కోణం ఆధారంగానే వార్తలను ప్రసారం చేస్తూ ఉంటుంది. అందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనే అవకాశాన్ని కూడా పాఠకులకు, ప్రేక్షకులకు ఇవ్వదు. స్థూలంగా చెప్పాలంటే నా ఛానల్ నా ఇష్టం, నా వార్తలు నా ఇష్టం అనే తీరుగా ఆ మేనేజ్మెంట్ వ్యవహారం ఉంటుంది.

తాజాగా ఆ చానల్లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంపై ఒక కథనం ప్రసారం అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందుల పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులు స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు నిర్వహించారు. సో ఇందులో తప్పు వెతకడానికి లేదు. ప్రభుత్వ పరంగా బిల్లులు చెల్లించడంలో జాప్యం ఏర్పడిన నేపథ్యంలో ఆ పనులు చేసిన నాయకులు జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. బిల్లులు రాకుంటే కష్టం అని అన్నారు. కానీ ఈ వార్తను ప్రజెంట్ చేయడంలో ఆ ఛానల్ పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒకవైపు పనులు జరిగాయని చెబుతుంది. మరోవైపు గ్రామాల్లో పనులు జరగలేదని చెబుతుంది. మరి పనులు జరగకపోయి ఉంటే బిల్లులు చెల్లించాలని ఎందుకు వైసిపి నాయకులు డిమాండ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం డబ్బులు ఊరకనే ఇవ్వరు కదా. ఒకవేళ రేపటి నాడు ఆయన ప్రభుత్వం ఓడిపోతే నూతన ప్రభుత్వం దాని పై విచారణ జరిపిస్తుంది కదా.. తప్పు చేసినట్టు రుజువైతే న్యాయస్థానం ముందు తలవంచాల్సి ఉంటుంది కదా.. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి ఆ ఛానెల్ జగన్ మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేసింది. దీనిని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియో మీద అటు అధికార పార్టీ అనుకూల వర్గాలు,ఇటు టిడిపి వర్గాలు రకరకాలుగా కామెంట్ల యుద్ధం చేసుకుంటున్నారు.