Homeజాతీయ వార్తలుRevanth Reddy: ఇదిగో అవినీతి ఆధారాలు.. కేటీఆర్ ను ఇరుకునపెట్టిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఇదిగో అవినీతి ఆధారాలు.. కేటీఆర్ ను ఇరుకునపెట్టిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా తయారైంది తెలంగాణలో పరిస్థితి. ఓవైపు ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ‘టీఎస్ బీపాస్’లో ప్రజలు ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి పారదర్శకంగా అనుమతులు ఇస్తానంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆన్ లైన్ లో అప్లై చేసుకున్న పాపానికి ఆఫ్ లైన్ లో అధికారులు తిప్పి తిప్పి చంపుతున్నారట.. దరఖాస్తులకు అస్సలు ఆమోదముద్ర వేయడం లేదు. వారిని కలిసి లంచాలు ఇవ్వనిదే పని జరగడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

revanth reddy ktr
revanth reddy ktr

‘టీఎస్ బీపాస్’లో ఇప్పుడు ఆన్ లైన్ అనుమతులు కేవలం 20 రోజుల్లోనే ఇస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘనంగా ప్రకటించాడు. కానీ పైసలు ఇవ్వని అప్లికేషన్లు ఏదో కారణంతో రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక రెండు మూడు నెలలు కూడా ఇంటి నిర్మాణ దరఖాస్తులు పెండింగ్ లో పడిపోతున్నాయి. డబ్బులిచ్చి అధికారులతో సామరస్యంగా ఉన్న వారి అనుమతులు కేవలం ఒకరోజులోనే వచ్చేస్తున్నాయన్న విమర్శలున్నాయి.

ఇక కొందరు మాత్రం టీఎస్ బీపాస్, బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు లాంటివేవి తీసుకోకుండా కబ్జాకు పాల్పడుతున్నారు. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారన్న దీమాతో అక్రమ కట్టడాలను ఇష్టానుసారంగా నిర్మించేస్తున్నారు. సామాన్యులు, పేదలు అక్రమంగా కడితే కూల్చేసే మున్సిపల్ అధికారులు కొందరు పెద్దలు, పలుకుబడి ఉన్న వారు అక్రమంగా కడుతున్నా చోద్యం చూడడం తప్పితే ఏం చేయలేకోపోతున్నారన్న విమర్శ ఉంది. హైదరాబాద్ లో ఇలాంటి అక్రమాలు వెల్లువెత్తుతున్నా కిక్కురుమనని పరిస్థితి.

తాజాగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనమైంది. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేసి మరీ ఆ శాఖ పరిధిలో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాల ఫొటోలను బయటపెట్టి రేవంత్ రెడ్డి నిలదీశాడు.

ఉప్పల్ కలాన్ లోని జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్ గా మారింది. ఉప్పల్ చౌరస్తాలో అక్రమ మల్టీ ప్లెక్స్ నిర్మాణాలపై ఆ శాఖ మంత్రి కేటిఆర్ ను రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించాడు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు.

మీ శాఖ బాగోతాల మీద చర్యలు ఉంటాయా..? లేక మీరు అందులో భాగస్వాములా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆధారాలను అటాచ్ చేస్తూ సీఎంఓకు, జీహెచ్ఎంసీ కమిషనర్ కు టాగ్ చేసిన రేవంత్ ఈ విషయాన్ని ప్రజలు ముందు బట్టబయలు చేసి అధికార పార్టీని ఇరుకునపెట్టారు. మరి దీనిపై మంత్రి కేటీఆర్, అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version