Homeఆంధ్రప్రదేశ్‌Ram Gopal Varma : ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతోంది.. బాంబు పేల్చిన జగన్ ఫ్రెండ్...

Ram Gopal Varma : ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతోంది.. బాంబు పేల్చిన జగన్ ఫ్రెండ్ రాంగోపాల్ వర్మ

Ram Gopal Varma – AP Assembly : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ తో పాటు రాష్ట్రంలోనూ ఎన్నికలు జరగవచ్చు అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనికి బలాన్ని చేకూర్చేలా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. త్వరలోనే ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతోంది అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారని వార్తలు కొద్ది రోజులుగా రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు అని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ వార్తలను, అంచనాలను అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించడం లేదు. దీంతో అవన్నీ నిజమేనన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి..

సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్నికలు దిశగా క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రెండు రోజుల్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ కూడా ఈ సన్నాహకాల్లో భాగమేనని అందుకే ఆయన హుటాహుటిన ఈ బేటిని నిర్వహిస్తున్నారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో సంకేతాలు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉండాలని ఆ పార్టీ అగ్ర నాయకులు పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఆసక్తిని కలిగిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అమితంగా అభిమానించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ట్విట్టర్లో ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు నిజమే అన్న భావన వ్యక్తం అవుతోంది. త్వరలో ఏపి అసెంబ్లీ రద్దు కాబోతుందని ఆయన ప్రకటించారు. వైయస్ జగన్ తాను అభిమానిస్తానంటూ ఇదివరకే ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. వైసిపి సానుభూతిపరుడుగా ఆయనతో కొంత గుర్తింపు కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతోందని చెప్పడం కలకలం రేపింది. రాజకీయంగా ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

అగ్రనాయకత్వం సమాచారంతోనే అన్న రామ్ గోపాల్ వర్మ..

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. అక్కడ కీలక కామెంట్లు కూడా చేశారు. వైయస్సార్సీపి అగ్ర నాయకత్వం నుంచి తనకు అందిన సమాచారం మేరకు ఈ విషయాన్ని పంచుకున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. జూన్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ రద్దు అవుతుందని తేల్చి చెప్పారు. డిసెంబర్ లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్సిపిలో తనకు ఉన్న సోర్స్ నుంచి ఈ సమాచారం బయటకు వచ్చిందని ఆయన పేర్కొనడం గమనార్హం.

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం పార్టీ అభిమానులు భిన్నంగా దీనిపై స్పందిస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు భయపడి వైయస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారంటూ టిడిపి సానుభూతిపరులు కామెంట్స్ పెడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం జగన్ కు రాకపోవచ్చు అనే వాదనలను వైసీపీ సానుభూతిపరులు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏప్రిల్ ఒకటి కావడం వలనే.. రాంగోపాల్ వర్మ ఈ ట్వీట్ చేసి ఫూల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రాజ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ రాజకీయంగా కొంత అలజడిని సృష్టించిందని చెప్పాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version