Maldives
Maldives: పది రోజులుగా ఏ ఛానెల్ చూసినా.. ఏ పేపర్ చదివినా.. లక్ష్యద్వీప్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన.. దాని ప్రభావంతో మాల్దీవుల్లో జరుగుతున్న పరిణామాల గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. మోదీ… ఒక్కరోజు లక్ష్యద్వీప్కు వెళ్లి బీచ్ ఒడ్డున కుర్చీ వేసుకుని కూర్చున్నారు. కాసేపు వాక్ చేశారు. తర్వాత స్కోర్నెలింగ్ చేశారు. ఈ ఫొటోలను మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అంతే.. మాల్దీవుల టూరిజం వెనుకబడుతోంది. బుకింగ్స్ రద్దవుతున్నాయి. లక్ష్యద్వీప్కు ఎలా వెళ్లాలి.. ఎప్పుడు వెళ్లాలి అని ఆరా తీయడం మొదలు పెట్టారు. మాల్దీవులు టూరిజం బూకింగ్స్ క్యాన్సిలేషన్లు చూపించి కొంత మంది దేశభక్తులు జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రధాని మోదీపై ఆదేశ మంత్రులు చేసిన విమర్శలు బాయ్ కాట్ మాల్దీవులు ఉద్యమానికి బీజం వేశాయి. స్పందించిన మాల్దీవుల ప్రభుత్వం మోదీని నిందించిన మంత్రులను తొలగించింది. అయినా.. మాల్దీవులపై వ్యతిరేకత చల్లారడం లేదు.
లక్ష్యద్వీప్పై మాల్దీవుల ప్రభావం ఎంత?
మాల్దీవుల కారణంగానే మన దేశంలోని లక్ష్యద్వీప్ టూరిజం పరంగా అభివృద్ధి చెందడం లేదని చాలా మంది చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్ష్యద్వీప్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్దే. దానిని టూరిజం స్పాట్గా డెవలప్ చేయడంలో విఫలమయ్యారు. ఇప్పుడు మోదీ ఒక్కరోజు పర్యటనతో అందరూ ఆహా.. ఓమో అంటున్నారు. కేవలం ఫొటో షూట్ చేసినంత మాత్రాన టూరిస్టులు వస్తారా.. మౌలిక సదుపాయాలు పెంచితే వస్తారా.అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.
ఎక్కడా పోలిక లేదు..
ఇక మాల్దీవులతో పోల్చితే లక్ష్యద్వీప్కు ఒక్క శాతం కూడా పోలిక లేదు. మాల్దీవుల్లో ఉన్న సౌకర్యాలతో పోలిస్తే.. లక్ష్యద్వీప్లో ఒక్కశాతం కూడా లేవు. టూరిస్ట్ ప్లేస్ అంటే.. అక్కడ ఉండే ఆహ్లాదాన్ని ఎంజాయ్ చయడానికి టూరిస్టులు వెళ్తారు. కానీ సౌకర్యాలు లేని టూరిస్ట్ ప్లేలస్కు వెళ్లాలని ఎవరూ కోరుకోరు. మాల్దీవులకు టూరిస్టులు ఎక్కవగా వెళ్లేందుకు కారణం.. అక్కడి సౌకర్యాలే. వారి మార్కెటింగ్ కూడా వేరేగా ఉంటుంది. బాలీవుడ్ స్లార్లకు ఉచిత హాలీడే ప్యాకేజీలు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటారు. ఇదంతా టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వారికి తెలుసు. మనం మాల్దీవులను మించిపోవాలంటే.. లక్ష్యద్వీప్ మంచి టూరిజం స్పాట్ కావాలంటే.. ముందుగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి.
సముద్రంలో కలిసిపోయే ప్రమాదం..
శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజవర్గం అంత జనాభా ఉన్న దేశం మాల్దీవులు. అతిచిన్న దేశం పూర్తిగా టూరిజంపై ఆధారపడి ఉంది. ఇంకో 50 ఏళ్లలో ఆ దేశం సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దేశ జనాభా 5 లక్షలు. ఇక మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాలో 135 కోట్ల మందికి అటూ మాల్దీవులకు గానీ, ఇటు లక్ష్యద్వీప్కు గానీ వెళ్లే స్థోమత లేదు. కానీ, చిన్న దేశమైన మాల్దీవుల టూరిజాన్ని దెబ్బ కొట్టడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి.