NTR 100 Rupees Coin: నందమూరి నాణెం.. ఎన్టీఆర్‌ శంతజయంతి కానుక.. దీని విశేషాలు ఇవీ..!

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేస్తారని తెలిసింది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. నందుమూరి కుటుంబానికి కూడా ఆహ్వానం అందింది.

Written By: Raj Shekar, Updated On : August 28, 2023 12:25 pm

NTR 100 Rupees Coin

Follow us on

NTR 100 Rupees Coin: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఎన్టీఆర్‌ తన నటనతో మెప్పించడమే కాకుండా సంక్షేమ పాలనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ మహనేత శత జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద వంద రూపాయలు నాణెం ముద్రించింది.

వందో పుట్టిన రోజు కానుక..
నందమూరి తారకరామారావు జన్మించి… ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయన శత జయంతి వేడుకలను నందమూరి కుటుంబంతోపాటూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని ఆయన గౌరవార్ధం ఇవాళ ఆగస్టు 27న(సోమవారం)విడుదల చేస్తోంది.

రాష్ట్రపతి చేతుల మీదుగా..
ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేస్తారని తెలిసింది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. నందుమూరి కుటుంబానికి కూడా ఆహ్వానం అందింది. ఈమేరకు ఎన్టీఆర్‌ తనయులు బాలకృష్ణ, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ , బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు.

పంచలోహాలతో నాణెం..
ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తున్న ఈ నాణెం 100 శాతం లోహాలతో తయారు చేయడం విశేషం. 44 మిల్లీమీటర్ల ఈ నాణెంలో 50 శాతం సిల్వర్‌ (వెండి), 40 శాతం కాపర్‌ (రాగి) మిగతా 5, 5 శాతాల్లో నికెల్, జింక్‌ లోహాలతో ఉండి.. సరిగ్గా 100 శాతం లోహాలతో తయారయ్యేలా చేశారట. నాణేనికి ఓ వైపు 3 సింహాలతోపాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్‌ చిత్రం, దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. అంతేకాదు దీనికి సంబంధించిన కొన్ని పిక్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

హైదరాబాద్‌లో తయారీ..
ఈ నాణేన్ని హైదరాబాదులోని మింట్‌ కాంపౌండ్‌లోనే ముద్రించారు. 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్‌ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యులకే స్వయంగా సెలెక్ట్‌ చేసుకునే అవకాశం కల్పించారని తెలిసింది. నందమూరి తారక రామారావు రూపంతో ఈ 100 రూపాయల నాణెం ముద్రించడం పట్ల నందమూరి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు.