POK merge with India: ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మళ్లీ భారత్లో అంతర్భాగం కాబోతోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. మౌడ్యుల సంఘం అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్య కేవలం ఒక అభిప్రాయం కాదు.. భౌగోళిక, రాజకీయ మార్పులకు అద్దం పడుతోంది. పీవోకేలోని ముస్లింల మనస్తత్వంలో వస్తున్న మార్పు, పాకిస్తాన్పై వారిలో పెరుగుతున్న వ్యతిరేకత కారణమంటున్నారు.
ముస్లింలలో మార్పు…
పీవోకేలోని ముస్లింలలో గతంలో ఉన్న భారత వ్యతిరేక ధోరణి ఇప్పుడు గణనీయంగా మారింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో జరిగిన అభివృద్ధి, పర్యాటకం పెరుగుదల, ఉద్యోగావకాశాల పెరుగుదల వంటివి పీవోకే ప్రజల వైఖరిలో మార్పు తెస్తున్నాయి. తాము పాకిస్తాన్లో ఉండి అభివృద్ధికి దూరమయ్యామని వారు గుర్తిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లపై పీవోకే ముస్లింలలో ఉన్న అనుకూలత క్షీణించింది. పాకిస్తాన్ తమను కేవలం భారత్పై కుట్రలకు ఉపయోగించుకుంటోందని, తమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని వారు గుర్తిస్తున్నారు. పాక్, బంగ్లాదేశ్ అనుకూలులలో కూడా భారత్ పట్ల అభిమానం పెరుగుతోంది.
పాకిస్తాన్పై పీవోకే ప్రజల ఆక్రోశం
పాకిస్తాన్ ప్రభుత్వం పీవోకే ప్రజలపై చూపిస్తున్న నిర్లక్ష్యం, అణచివేత ప్రజలలో తిరుగుబాటుకు కారణమవుతోంది. పీవోకేలోని వనరులను పాకిస్తాన్ దోచుకుంటోంది. గోధుమ పిండిపై సబ్సిడీ లేదు, విద్యుత్ కోతలు, నిరుద్యోగం తాండవిస్తున్నాయి. పీవోకే అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 సెప్టెంబర్లో చరిత్రలోనే అతిపెద్ద నిరసన జరిగింది. పాక్ సైన్యం కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు, 22 మంది గాయపడ్డారు. ఇంటర్నెట్ నిలిపివేత, పోలీసుల మోహరింపు జరిగాయి. పాకిస్తాన్ పీవోకేను ఉగ్రవాద స్థావరంగా మార్చి, యువకులను ఉగ్రవాదులుగా మార్చి భారత్పై పంపుతోంది. ఇది స్థానికులకు ప్రమాదకరంగా మారింది.
భారత్లో కలపాలని డిమాండ్..
ఈ పరిణామాల నేపథ్యంలో పీవోకే ప్రజలు తమ స్వరం వినిపిస్తున్నారు. పీవోకేలోని రాజకీయ కార్యకర్త అమ్జద్ అయూబ్ మీర్జా వీడియో ద్వారా, ‘పాకిస్తాన్ తీరుతో విసిగిపోయాం, భారత్లో విలీనం కావాలి‘ అని డిమాండ్ చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ‘పీవోకేలోని ప్రజలే భారత్లో విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అది త్వరలోనే జరుగుతుంది‘ అని ప్రకటించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా, ‘పీవోకే భారత్లో భాగమే, ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం‘ అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ పది రోజుల్లో మూడు సార్లు పీవోకే గురించి ప్రస్తావించారు.
పీవోకే భారత్లో విలీనం అనేది ఇక ఊహాగానం కాదు. అది సాధ్యమయ్యే లక్ష్యంగా మారింది. పాకిస్తాన్ తన తప్పుడు విధానాలతో పీవోకే ప్రజలను భారత్ వైపు నెడుతోంది. ముస్లింల మనస్తత్వంలో వస్తున్న మార్పు, పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత పెరగడం ఇవన్నీ భారత్కు అనుకూలంగా మారుతున్న సంకేతాలు.