Pawan kalyan :జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా ‘ఉక్కు ఉద్యమాన్ని’ రగిలించాడు. ఓవైపు బీజేపీతో ఏపీలో పొత్తు పెట్టుకొని ముందుకెళుతున్న పవన్.. మరోవైపు అదే పార్టీ చేస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ అక్కడికెళ్లారు. పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టులో దిగగానే జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ నీరాజనం పలికారు. పూలు, భారీ జనసందోహంతో విశాఖ స్టీల్ పరిశ్రమ దాకా పెద్ద ర్యాలీ తీశారు.
pawan vizag steel
అనంతరం ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ స్టీల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరుఫున పూర్తి మద్దతు ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గేటు ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని బీజేపీ పేరు ఎత్తుకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికుల వైపు నిలబడాలి’ అని శ్రీశ్రీ రాసిన కవితలతో ఉపన్యాసం ప్రారంభించి కార్మికుల్లో జోష్ నింపారు.
దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యం అని .. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్లదు అని పవన్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కోసం ఏయూ విద్యార్థులు.. ఎంతో మంది పోరాటం చేసి నాడు పోలీస్ కాల్పుల్లో 32మంది చనిపోయిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కును రక్షించుకుందామంటూ పిలుపునిచ్చారు.
ఏపీలో కలిసి సాగుతున్న బీజేపీ-జనసేన కాపురంలో ఇప్పుడు ‘విశాఖ ఉక్కు’ చిచ్చు పెట్టిందనే చెప్పాలి. పవన్ విశాఖలో పర్యటించి ఉక్కు ఉద్యమానికి మద్దతు పలకడం.. కార్మికుల వెంట ఉంటానని పిలుపునివ్వడం బీజేపీకి మింగుడు పడడం లేదు. దీంతో మొదలైన ఈ కలహాల కాపురం ఎటువైపు సాగుతుంది? వీరి మధ్య విభేదాలు వచ్చినట్టేనా? 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ ఎవరిదారి వారిదేనా? పవన్ బీజేపీ చేయి వదిలేసి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి స్నేహ హస్తం చాచుతాడా? ఇలా ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
దాదాపు 3 రోజుల పాటు విశాఖలో ఉండబోతున్న పవన్ తీరు ఇప్పుడు ఏపీ బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బీజేపీ మాట ఎత్తకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతానన్న పవన్ మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మిత్రుడు శత్రువుగా మారడం ఖాయమా? అన్న ఆందోళన బీజేపీలో నెలకొందట..