Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ఉమ్మడి ఏపీని పాలించిన తొట్టతొలి దళిత ముఖ్యమంత్రిపై సంచలన ప్రతిపాదన చేశారు. ఆయనను పార్టీలు అవమానించినా.. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోయినా జనసేనాని పవన్ మాత్రం ఇటీవలే నివాళులర్పించి ఆయన కీర్తిని నలుచెరుగులా చాటాడు. తాజాగా ఈ దళిత దిగ్గజానికి అత్యున్నత గౌరవం కల్పించేందుకు రెడీ అయ్యారు. పవన్ చేస్తున్న డిమాండ్ ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార వైసీపీని డిఫెన్స్ లో పడేసేలా ఉంది.
Pawan Kalyan damodara
ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలకు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన పవన్ ఇటీవల దామోదర సంజీవయ్య స్మారకానికి ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది ముఖ్యంగా ఏపీలో అత్యధికంగా ఉన్న దళితులను ఆకర్షించింది.గతంలో ప్రకృతి విపత్తులు, కరోనా వేళ ప్రభుత్వాలకు రూ. కోటి చొప్పున సాయం చేశాడు. సైనిక సంక్షేమానికి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఇదే తరహాలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాన్ని పాలించిన ఒక దళిత దిగ్గజం కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ విరాళం ప్రశంసలు కురిపించింది.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో దళితులకు రాజ్యాధికారం వచ్చింది వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందులో ముఖ్యుడు దామోదరం సంజీవయ్య. ఉమ్మడి ఏపీకి రెండేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండేళ్లలోనే ప్రజాహిత పనులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దళిత నేత.. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల పాలిటిక్స్ కు పదవి కోల్పోయాడు. ఆ తర్వాత ఈ దళిత నేతను అటు కాంగ్రెస్ ఇతర పార్టీలు పట్టించుకున్న పాపాన పోలేదు.
పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన పార్టీకి ఈ దళితదిగ్గజాన్ని ఓన్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు దామోదరం సంజీవయ్య స్మారకం నిర్మాణం కోసం ఏకంగా రూ. కోటి విరాళం ప్రకటించడం సంచలనమైంది. ఈ కోటితోపాటు నిధిని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి స్మారకం నిర్మిస్తానని పవన్ చేసిన ప్రకటన మిగతా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏపీలో మెజార్టీ కాపులు, దళితులే. ఇప్పటికే కాపులను తనవైపు తిప్పుకున్న పవన్ ఇప్పుడు మెజార్టీగా ఉన్న దళితులను ఆకర్షించే పనిలో పడ్డారు.అందుకే తాజాగా మరో సంచలన డిమాండ్ లేవనెత్తారు.
దళితుల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఒక హక్కుగా తాము ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే తానే అధికారంలోకి వచ్చాక కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు మారుస్తామని పవన్ సంచలన ప్రకటన చేశారు. అందుకు కట్టుబడి ఉన్నామని పవన్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వమైనా ఆ మహా మనిషికి గౌరవం ఇవ్వాలని.. కడప జిల్లాను వైఎస్ఆర్ కడపగా మార్చినట్టే కర్నూలును మార్చాలన్న పవన్ డిమాండ్ ఇప్పుడు సంచలనమైంది.