ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వచ్చేసారి అధికారంలోకి రావడం కష్టమేనని తేలినా సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటున్న పరిస్థితి తమిళనాట నెలకొంది.ఏదో అమ్మ జయలలిత స్టామినాతో గత రెండు సార్లు తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. మూడోసారి కూడా రావడం ఇప్పుడు కష్టమే. ఎందుకంటే అటు జయలలిత లేదు. ఇటు శశికళ లేదు. అన్నాడీఎంకేలో అసలు పేరున్న నేతలే లేరు. దీంతో పార్టీని అధికారంలోకి ఎలా తేవాలో ఆలోచించాల్సిన అన్నాడీఎంకే పార్టీ పెద్దలు సీఎం కుర్చీ కోసం కొట్లాడుకున్న పరిస్థితి తాజాగా నెలకొంది.
Also Read : బరిలో టీడీపీ.. తెలంగాణలో డిపాజిట్లు వస్తాయా..?
గత సంవత్సరం కిందట తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీలో సీఎంగా ఆమె నమ్మినబంటు పన్నీర్ సెల్వం అయ్యాడు. అయితే జయలలిత మరణించాక ఆమె స్నేహితురాలు శశికళ ఆధిపత్యం అన్నాడీఎంకేలో వచ్చింది. పన్నీర్ సెల్వంను పక్కనపెట్టి ఫళని స్వామిని సీఎంను చేసింది శశికళ. అయితే శశికళ జైలుకు వెళ్లడంతో పన్నీర్ సెల్వం పార్టీలో అసమ్మతి రాజేశారు. ఆ తర్వాత బీజేపీ ప్రోద్బలంతో పన్నీరు, ఫళని రాజీకొచ్చి సీఎంగా ఫళని.. డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వంలు కొనసాగుతున్నారు. అయితే మంత్రుల్లో కేడర్ పరంగా పన్నీర్ సెల్వం పెద్ద వాడు..
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇవాళ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో సీఎం ఫళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని ఫళని స్వామితో పన్నీర్ సెల్వం వాగ్వాదానికి దిగారు. తాను తాత్కాలికంగా మాత్రమే డిప్యూటీ సీఎంగా అంగీకరించానని.. ఇకపై అలా కుదరదని పన్నీర్ సెల్వం తేల్చిచెప్పారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ చీలిక దిశగా పరిణామాలు కొనసాగుతున్నాయి.
అన్నాడీఎంకే పార్టీకి ఈసారి తమిళనాడు ఎన్నికల్లో కష్టమేనంటున్నారు. డీఎంకే స్టాలిన్ గెలుపు పక్కాగా కనిపిస్తోంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే చెప్పలేం..పరిణామాలు వేగంగా మారవచ్చు అంటున్నారు.
Also Read : తాజా సర్వే : ఆడవాళ్లు ఆరోగ్యానికి హానికరమా.. ప్రయోజనమా.?