Operation Moranchapalli: భారీ వర్షాలకు తెలంగాణలో ఊళ్లు ఏర్లు ఏకమవుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు నీటమునుగుతున్నాయి. చెరువులకు గండ్లు పడుతున్నాయి.. రోడ్లు తెగిపోతున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మోరంచవాగు నీటితో ఊరు మొత్తం మునిగిపోయింది.
వరదలో 1,500 మంది..
ఇక మోరంచపల్లిలో సుమారు 1,500 మంది నీటిలో చిక్కుకుపోయారు. భారీ వర్షాలకు తెల్లవారేసరికి మోరంచపల్లి వాగు ఉప్పొంగడంతో నీరు ఊళ్లోకి చేరింది. ఉదయం నిద్రలేచేసరికి నీరు చుట్టు ముట్టడంతో తాము ప్రాణాలతో బయటపడతామా లేదా అని టెన్షన్ పడుతున్నారు. చాలా మంది భవనాలపైకి ఎక్కి సాయం కావాలని వేడుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.
సీఎం సమీక్ష..
రాష్ట్రంతో అత్యంత దయనీయ పరిస్థితిలో మోరంచపల్లి ఉన్న విషయ తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రంగంలోకి హెలిక్యాప్టర్లు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..
సీఎం ఆదేశాలతో రెండు ఆర్మీ హెలికాప్టర్లను హైదరాబాద్ నుంచి మోరంచపల్లికి బయలుదేరాయి. మోరంచపల్లి సమీపంలో నదిలో చిక్కుకుపోయిన జేసీబీలోని ఆరుగురిని రక్షించేందుకు ఈ హెలికాప్టర్లను పంపారు. మరోవైపు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది మోరంచపల్లికి చేరుకుంటున్నారు. మోరంచపల్లి సమీపంలోని కుందూరుపల్లికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. బోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోరంచపల్లికి చేరుకుంటారు. బోట్ల సాయంతో వరద బాధితులను బయటకు తీసుకువస్తామన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా గ్రామానికి చేరుకున్నారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ఈ గ్రామంలో పరిస్థితిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ టీమ్లను గ్రామానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్లతో ఆహారం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టు బట్టలతో ఇళ్లపై ఉన్నవారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.