Homeజాతీయ వార్తలుదిగివచ్చిన చమురు ధరలు.. అడ్డుపడిన రాకాసి ఓడ

దిగివచ్చిన చమురు ధరలు.. అడ్డుపడిన రాకాసి ఓడ

Suez Canal
సుమారు ఏడాది కాలంగా పెట్రోల్‌ రేట్లు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 100 రూపాయలు దాటగా.. ఇంకొన్ని రాష్ట్రాల్లో వందకు చేరువలో ఉన్నాయి ధరలు. అయితే.. ఇప్పడిప్పుడే ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. కొన్ని పైసలు తగ్గగా.. ఇప్పుడు దానికి కూడా బ్రేక్‌ పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఓ మాయదారి భారీ ఓడ పెట్రోల్‌ ధరల పతనానికి అడ్డుపడింది. భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా అయ్యే ఓ మార్గాన్ని వారం రోజులుగా మూసేసింది.

ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరగడం మొదలైంది. దీంతో మన దేశంలోని కంపెనీలు చమురు ధరల తగ్గింపును నిలిపివేశాయి. ఇక ప్రపంచం విషయానికొస్తే ఒక్క చమురే కాదు.. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఆహారం, నిత్యావసరాలు, దుస్తులు, ఆటోమొబైల్‌ వంటి వాటిపైనా ఈ ప్రభావం పడుతోంది. దీంతో ప్రపంచ వాణిజ్యాన్ని ఈ ఓడ భారీగా భయపెడుతోంది.

భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశం ఇరాక్‌. ఆ తర్వాత స్థానాన్ని ఇటీవల అమెరికా ఆక్రమించింది. దీంతోపాటు లాటిన్‌ అమెరికా దేశాల నుంచి భారత్‌ చమురు దిగుమతి చేసుకుంటుంటుంది. ఈ చమురు మొత్తం సూయజ్‌ కెనాల్‌ నుంచి వస్తుంది. ఈ మార్గంలో మనకు నిత్యం 5,00,000 పీపాల చమురు వస్తుంటుంది. అదే చైనాకు 4,00,000 పీపాల చమురు వెళ్తుందని వోర్టెక్సా లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ద.కొరియా, సింగపూర్‌‌ ఉన్నాయి.

ఇక చమురు ఉత్పత్తులను ఈ మార్గంలో అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ది ఆరో స్థానం. దీంతో భారత్‌ ఆ మేరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా చేయించుకోవాలి. కాకపోతే సూయజ్‌ వద్ద భారీగా చమురు ట్యాంకర్లు చిక్కుకుపోయాయి. దీంతో ట్యాంకర్ల కొరత కూడా ఏర్పడింది. ఫలితంగా రవాణా చార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ట్యాంకర్ల చార్జీలు, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ నుంచి ప్రయాణించడం వల్ల చేరే అదనపు దూరం ఖర్చులు కూడా చమురు వినియోగదారులపైనే పడనున్నాయి. దీంతో రవాణా చార్జీలు 5 నుంచి 15 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సూయజ్‌ కాల్వ నిలిచిపోవడంతో అత్యధికంగా ఆసియా–ఐరోపా వాణిజ్యంపైనే ప్రభావం చూపనుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తే రద్దీగా ఉండే సింగపూర్‌‌–రోడర్‌‌డ్యామ్‌ మార్గంలో వేల నాటికల్‌ మైళ్ల తేడా వస్తుంది. సూయజ్‌ మార్గం ద్వారా వెళ్తే.. 34 రోజుల పాటు 8,301 నాటికల్‌ మైళ్లు ప్రయాణించాలి. అదే కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మార్గంలో వెళ్తే 43 రోజులపాటు 11,750 నాటికల్‌ మైళ్లు ప్రయాణించాలి. అదనపు రోజుల ప్రయాణానికి నౌకలకు 800 టన్నులకు పైగా చమురు ఖర్చవుతుంది. ఇది మొత్తం వినియోగదారులపైనే పడుతుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version