Rushi Raj YCP Strategist: రుషిరాజ్.. వైసీపీలో వినిపిస్తున్న మాట ఇది. ఆయన నాయకుడు కాదు. వైసీపీకి కొత్త వ్యూహకర్త. వైసీపీని రెండో సారి అధికారంలో తెచ్చే బాధ్యతలను ప్రశాంత్ కిశోర్ రుషిరాజ్ భుజాలపై పెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉంది. ప్రాంతాలు, కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, సోషల్ మీడియాలో అప్పటి ప్రభుత్వం పై వ్యతిరేక కామెంట్లు పోస్టు చేయడం.. ఇలా ఒకటేమిటి చిత్ర విచిత్ర విన్యాసాలు ఏపీ వ్యాప్తంగా నాడు కనిపించాయి. దాని ఫలితమే వైసీపీకి కనీవినీ ఎరుగని విజయం. కానీ ప్రస్తుతం వైసీపీ సర్కారు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కానీ వైసీపీని గట్టెక్కించడానికి ప్రశాంత్ కిశోర్ అందుబాటులో లేరు.పీకే ఇప్పుడు ఆయన సొంత రాజకీయం బీహార్ లో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నేరుగా వచ్చి ఇతర పార్టీలకు సేవలు అందించే పరిస్థితుల్లో లేరు. కానీ ఐ ప్యాక్ మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో రుషిరాజ్ అనే మరో సమన్వయకర్తను వైసీపీ కోసం పంపించారు. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ (పీకే) ఆయన సొంతరాష్ట్రం బిహార్లో ‘జన్ సురాజ్’ యాత్రలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో… ఆయన సహచరుడు రుషిరాజ్సింగ్కు వైసీపీ వ్యూహరచన బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే వర్క్షాప్లో పార్టీ నేతలకు రుషి రాజ్సింగ్ను ‘వ్యూహకర్త’గా పరిచయం చేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికలముందు పీకేను ఇలాగే పరిచయం చేశారు.

వర్క్ షాపునకు అదే కారణం..
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతో అకస్మాత్తుగా వర్క్షాప్ ఏర్పాటు చేయడానికి కారణం కూడా అదే. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో వైఫల్యాలు ఎదురవుతున్నాయి. సీఎం సభలకు సైతం జనాలు ముఖం చాటేస్తున్నారు. గడపగడపకూ ప్రభుత్వంలో వైసీపీ ప్రజాప్రతినిధులకు నిలదీతలు ఎదురవుతున్నాయి. ప్రజలు కనీస గౌరవం ఇవ్వకపోగా.. సమస్యలపై కడిగి పారేస్తున్నారు.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: జగన్ కు ఏదో ఉచ్చు బిగిస్తున్న సీబీఐ
మరోవైపు మంత్రుల బస్సు యాత్ర సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే తాడేపల్లిలో ఉన్నపలంగా వర్క్ షాప్ ఏర్పాటుచేశారు. పనిలో పనిగా రుషిరాజ్ పరిచయం చేయనున్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కుటుంబానికీ ఎంతెంత లబ్ధి చేకూరుస్తున్నామో వివరించడం వంటి వాటిపై రుషిరాజ్ టీమ్ తో అవగాహన కల్పించనున్నారు. భవిష్యత్లో ఈ కార్యక్రమాన్ని ఎలా చేపట్టాలో ఈ వర్క్షాప్ లో దిశానిర్దేశం చేయనున్నారు. రుషిరాజ్ చెప్పినట్లుగా చేయాల్సిందేనని పార్టీ నేతలకు జగన్ తేల్చి చెప్పే అవకాశం ఉంది. ఆయన టీం ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ.. అభ్యర్థుల విషయంలో సూచనలు చేయనుంది. ఈ సారి కూడా కులాల టార్గెట్గానే రాజకీయాలు ఉండనున్నాయి.

ఈసారి బీసీలే టార్గెట్..
2014 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా పెట్టుకున్నారు. జిల్లాలను యూనిట్ గా తీసుకొని ఐదేళ్ల పాటు పీకే కుల, వర్గ రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చారు. సక్సెస్ అయ్యారు కూడా. అందుకే రుషిరాజ్ ఈసారి బీసీ కులాలకు ప్రాధాన్యం పేరుతో రాజకీయాలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీలపై ఫేక్ పోస్టులతో దాడి చేయడం.. ఆ పార్టీపై సామాజికవర్గాల నిందలతో పాటు వైసీపీలో .. కొత్తగా ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో పీకే చెప్పినట్లుగా చేసినా కొంత మందికి అవకాశం లభించలేదు. ఈ సారి రుషిరాజ్ ఏం చేస్తారోనన్న ఆందోళన వైసీపీలో వినిపిస్తోంది. పార్టీలో టిక్కెట్లు ఇప్పించింది గతంలో ప్రశాంత్ కిషోర్ అయితే.. ఇప్పుడు రుషిరాజ్ అనే చర్చ నడుస్తోంది.
Also Read:Minister KTR Foreign Tour: మంత్రి కేటీఆర్ 10 రోజుల విదేశీ టూర్ ఖర్చు అన్ని కోట్లా?