State Assemblies : అసెంబ్లీ సమావేశాలకు బద్దకమేనా ప్రజాప్రతినిధులూ?

State Assemblies :  దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలు ప్రజా సమస్యల వేదికలు. ప్రతిపక్షాలు లేవనెత్తడం.. అధికార పక్షం వాటిని తీర్చడం.. ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేయడం.. చట్టాలు రూపొందించడం అన్నీ వాటిల్లోనే జరుగుతుంటాయి. అయితే దేశంలో రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. తాజాగా వెల్లడించిన ఓ డేటా ఆశ్చర్యం గొలుపుతోంది. శాసనసభలు, పార్లమెంట్ వంటి చట్టసభలు ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశమైందో ఓ సర్వేసంస్థ లెక్కతేల్చింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో శాసనసభలు ఏడాదిలో సగటున […]

Written By: NARESH, Updated On : February 17, 2022 8:02 pm
Follow us on

State Assemblies :  దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలు ప్రజా సమస్యల వేదికలు. ప్రతిపక్షాలు లేవనెత్తడం.. అధికార పక్షం వాటిని తీర్చడం.. ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేయడం.. చట్టాలు రూపొందించడం అన్నీ వాటిల్లోనే జరుగుతుంటాయి. అయితే దేశంలో రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. తాజాగా వెల్లడించిన ఓ డేటా ఆశ్చర్యం గొలుపుతోంది.

శాసనసభలు, పార్లమెంట్ వంటి చట్టసభలు ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశమైందో ఓ సర్వేసంస్థ లెక్కతేల్చింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో శాసనసభలు ఏడాదిలో సగటున 30 రోజులు మాత్రమే సమావేశమవుతున్నాయని తేలింది. హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అయితే ఇది మరీ తక్కువగా అంటే 15 రోజులు మాత్రమేనట.. గత దశాబ్దకాలంలో ఏడాదిలో ఒడిశాలో అసెంబ్లీ సిట్టింగులు అత్యధికంగా 46 కావడం విశేషం. ఆ తర్వాత కేరళలో 43 రోజులు అసెంబ్లీ నిర్వహించారు. ఇదే అత్యధిక సగటు లెక్క అని ఈ రాష్ట్రాల శాసనసభా వెబ్ సైట్లు పేర్కొన్నాయి.

ఇక లోక్ సభ సగటున 63 రోజులని వెల్లడైంది. ఇండియాలో 19 అసెంబ్లీల సమావేశాల డేటాను వాటి వెబ్ సైట్లను పరిశీలించినప్పుడు వీటిలో ఏపీ, తెలంగాణ, ఒడిశా తప్ప ఇతర అసెంబ్లీ సిట్టింగుల సగటు భేటి 2012 నుంచి 2021 వరకూ లభ్యమైంది.

ఇక మన తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే..తెలంగాణ అసెంబ్లీ సగటున 21.5 రోజులు, ఏపీ శాసనసభ 21.5 రోజులు సమావేశం కాగా.. ఢిల్లీ 16.7 రోజులు, పంజాబ్ అసెంబ్లీ 14.5 రోజులు సమావేశమైనట్టు వెల్లడైంది. ఇక పొరుగున ఉన్న కర్ణాటక సభ సగటున 38.4 రోజులు, తమిళనాడు సభ 32, కేరళ అసెంబ్లీ 42.7 రోజులు భేటి అయ్యాయి. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అసెంబ్లీ సరాసరిన 23 రోజులు మాత్రం సమావేశమైంది.

నిజానికి 2020, 2021 ఈ రెండు సంవత్సరాలు కరోనాతో అందరూ లాక్ డౌన్ సహా ఆంక్షల వలయంలో ఉన్నారు. ఆ సమయాల్లో అతి తక్కువగా శాసనసభా సమావేశాలు జరిగాయి. అయితే లోక్ సభ మాత్రం 85 రోజులు భేటి కావడం విశేషం. 2020లో 33 రోజులు సమావేశమైంది.

ఈ డేటా చూస్తే ఈ సమావేశాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఎన్నికల వల్ల, రాష్ట్రపతి పాలన, ఇతర కారణాల వల్ల కూడా ఒక ఏడాదిలో అసెంబ్లీ సిట్టింగులు తగ్గిపోయాయని డేటా తేల్చింది. ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి ప్రజాప్రతినిధులను పంపిస్తే వారు పెద్దగా సమావేశాలకు హాజరుకాకపోవడంపై ప్రజల్లోనూ నిరాశ వ్యక్తమవుతోంది.

ఇక విదేశాల విషయానికి వస్తే.. అమెరికాలో ప్రతినిధుల సభ 2020లో 163 రోజులు, 2021లో 166 రోజులు సమావేశమైంది. రెండేళ్లలో సెనేట్ 192 రోజులు భేటి అయ్యింది. బ్రిటన్ పార్లమెంట్ 2020లో 145 రోజులు, జపాన్ పార్లమెంట్ 150 రోజులు సమావేశమైంది. కెనడా 127, జర్మనీ 104 రోజులు భేటి అయ్యింది. ఇండియాలో ఎన్నికల అనంతరం ఏర్పడిన చట్టసభలు అయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కువ రోజులు సమావేశం అవ్వాలని ప్రజలు కోరుతున్నారు.