MK Stalin defeat: అధికారం అనేది శాశ్వతం కాదు. ఒక పార్టీ అధికారాన్ని అనుభవించిన తర్వాత.. అదే స్థానంలో కొనసాగాలని లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ కూడా అదే. ప్రజలు నచ్చిన వాళ్లను ఎన్నుకుంటారు. నచ్చని వాళ్లను దూరం పెడతారు. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవు. అంతటి ఇందిరాగాంధీని సైతం ఓడించిన చరిత్ర భారతీయులది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను సభలోకి రాకుండా అడ్డుకున్న ఘనత కూడా ఈ దేశ ప్రజలదే. అందువల్లే ప్రజాస్వామ్యంలో ఏదైనా జరుగుతుంది. ఏమైనా జరుగుతుంది. అధికారం అనేది స్థిరం అనుకుంటే అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమిపాలైంది. దీనిని ఘోర ఓటమి అని చెప్పుకోడానికి లేదు. కాకపోతే తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ ఓడిపోవడమే ఇక్కడ అసలైన ఆశ్చర్యం. కొలత్తూరు నియోజవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్.. టివికే అభ్యర్థి బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. వాస్తవానికి స్టాలిన్ ఓటమిని డీఎంకే నేతలు అంచనా వేయలేకపోయారు. చివరికి స్టాలిన్ కూడా పసిగట్ట లేకపోయారు. తన విజయం మీద పూర్తిస్థాయి ధీమాతో ఉన్న స్టాలిన్.. ఈసారి కూడా ప్రభుత్వం మాది అన్నట్టుగా సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ వాస్తవంలో మాత్రం వేరే విధంగా కనిపించింది. అందువల్లే డీఎంకే పార్టీ ఓటమిపాలైంది.
వాస్తవానికి స్టాలిన్ ఓటమి డీఎంకే కార్యకర్తలను ఇబ్బందికి గురి చేసినప్పటికీ.. ఈ శాస్తి ఆయనకు జరగాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఓ వర్గం వారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఆయన కుమారుడు ఉదయనిది అన్ని వ్యవస్థలలో అడుగుపెట్టారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించడం ప్రారంభించారు. చివరికి సనాతన ధర్మాన్ని అంటురోగాలతో పోల్చారు. వాస్తవానికి నాడే స్టాలిన్ స్పందించి.. ఇటువంటి విధానాలకు స్వస్తి పలికి ఉంటే బాగుండేది. పైగా నీట్ వంటి పరీక్ష నిర్వహణ విషయంలో కూడా స్టాలిన్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు భారత దేశంలో భాగం కాదు అన్నట్టుగా.. సొంత దేశం అన్నట్టుగా మాట్లాడారు. చివరికి ప్రభుత్వ ఖజానా నుంచి ఇతర మతస్తులకు వివిధ పథకాల రూపంలో డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. అదే కాదు తమిళనాడులో ఆలయాల నుంచి డబ్బులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం ప్రారంభించారు. కానీ ఏ ఒక్క ఆలయానికి కూడా రూపాయి కేటాయించిన పాపాన పోలేదు స్టాలిన్ ప్రభుత్వం. అందువల్లే స్టాలిన్ వ్యవహార శైలి పట్ల అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయింది.
ఒక ముఖ్యమంత్రి ఓడిపోయారు అంటేనే అక్కడి ప్రజల్లో ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా డీఎంకే చేసిన తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవాలి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. లేనిపక్షంలో ఇటువంటి ఫలితాలే మళ్లీ మళ్లీ వస్తాయి. అప్పుడు డిఎంకె ఎన్ని రకాలుగా ద్రావిడ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ ఉపయోగము ఉండదు. ద్రావిడ వాదం అనేది ఎన్నికల్లో ఓట్లు పడేందుకు మాత్రమే దోహదపడుతుంది. ప్రజల మనసులో స్థిరమైన స్థానాన్ని సాధించడానికి కాదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని డీఎంకే నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది.