Milk Adulteration: ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత చాలామందికి టీ తాగడం అలవాటు. ఇంకా కొంతమందికి కాఫీ తాగడం అలవాటు. మరి కొంతమంది అయితే పాలు తాగుతారు. ఇలా తాగే పదార్థాలు మారినప్పటికీ ఇవన్నీ కూడా పాలతో ముడిపడి ఉన్నవి. పాల ద్వారా మాత్రమే ఇవి తయారు చేస్తారు.
పాలు సంపూర్ణ ఆహారం అని వైద్యులు చెబుతుంటారు. పాలను తాగడం వల్ల ఎముకల్లో క్యాల్షియం పెరుగుతుందని.. అవి దృఢంగా మారడం వల్ల రకరకాల వ్యాధులు దూరమవుతాయని అంటుంటారు. అయితే జనాభా పెరగడం.. అదే సమయంలో పశువుల సంఖ్య తగ్గడంత పాల ఉత్పత్తి నేల ముఖం పడుతుంది. ఇదే సమయంలో పాలకు డిమాండ్ పెరుగుతోంది. సహజంగానే డిమాండ్ పెరిగినప్పుడు.. సప్లై తగ్గినప్పుడు వస్తువు విలువ పెరుగుతుంది. అదే క్రమంలో కల్తీకి ఆస్కారం ఏర్పడుతుంది.
ఇప్పుడు మనదేశంలో పాల కల్తి పెరిగిపోయింది. ఈమధ్య పలు హోటల్స్.. ఇతర ఆహార విక్రయ కేంద్రాలలో అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ వినియోగిస్తున్న పన్నీర్ ను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత శాంపిల్స్ పరిశీలించగా అదంతా కూడా కల్తీ అని తేలింది. ఇంకా లోతుగా తనిఖీలు నిర్వహిస్తే మనదేశంలో ఉపయోగించే పన్నీర్ లో 70% వరకు కల్తీ అని తేలింది.
పన్నీర్ విషయంలోనే ఇలా ఉంటే.. ఇక పాల విషయంలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శనివారం గుజరాత్ రాష్ట్రంలో 300 లీటర్ల పాలతో 1800 లీటర్ల పాలు తయారు చేస్తున్నారని అధికారుల తనిఖీలలో తేలింది. ఇది కేవలం గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదని.. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇలాంటప్పుడు FSSAI ఏం చేస్తోందనే ప్రశ్న వ్యక్తమవుతోంది. తరచూ తనిఖీలు నిర్వహించి.. కల్తీకి పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
కల్తీ పాల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. వీటిని తాగడం వల్ల శరీరం తీవ్రమైన వ్యాధులకు గురవుతుంది. ఆ తర్వాత రకరకాల రుగ్మతలు శరీరం మీద దాడి చేస్తాయి. ఫలితంగా దేహం మొత్తం రోగాల కుప్పవుతుంది. అందుకే కల్తీ పాలు తయారు చేసే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.