Meteorological Analysis : తెలంగాణలో వచ్చే మూడు రోజులు చాలా డేంజర్ అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న అల్పపీడనానికి తోడుగా మరొకటి తయారైందని..అది ఒడిశా, చత్తీస్ గడ్, తెలంగాణపై కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దీని వల్ల తెలంగాణలో వచ్చే మూడు రోజులు కుంభవృష్టి కురుస్తుందని.. ప్రజలందరూ అప్రత్తంగా ఉండాలని కోరారు.

నిన్న దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఒరిస్సా తీరము.. మరియు పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది.
నిన్నటి ఉపరితల ఆవర్తనం.. ఈస్ట్వెస్ట్ షీర్ జోన్ ఈరోజు 20°N వెంబడి సగటు సముద్రం మట్టంకి 3.1 కి.మీ నుంచి 7.6 కి మీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ రోజు రుతుపవన ద్రోణి జైసాల్మర్, కోట, మాండ్ల , రాయిపూర్, ఝార్సిగూడ, తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
దీంతో రాగల 3 రోజులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది..ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ, అతిభారీ వర్షంతో పాటు ఈరోజు అత్యంత భారీవర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షంలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది.