చర్చలతో సాధ్యమయ్యే పనేనా..?

చత్తీస్‌గఢ్‌లో జవాన్లపై విరుచుకుపడిన మావోయిస్టులు మరోసారి సంచలనానికి తెరతీశారు. చర్చలు అంటూ తెరపైకి తీసుకురావంతో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 2004 మావోయిస్టు శాంతి చర్చలు తరువాత, ఇప్పుడు చత్తీస్‌గఢ్‌ దాడి నేపథ్యంలో శాంతి చర్చల తరహాలో మరోసారి అడుగులు పడుతున్నాయా..? మావోల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు పోయిన తరువాత ప్రభుత్వాలు చర్చలకు సానుకూలంగా ఉన్నారా..? లేక పరోక్షంగా మావోయిస్టు పార్టీనే చర్చల వ్యవహారం తెరపైకి తెస్తుందా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరు […]

Written By: Srinivas, Updated On : April 9, 2021 2:30 pm
Follow us on


చత్తీస్‌గఢ్‌లో జవాన్లపై విరుచుకుపడిన మావోయిస్టులు మరోసారి సంచలనానికి తెరతీశారు. చర్చలు అంటూ తెరపైకి తీసుకురావంతో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 2004 మావోయిస్టు శాంతి చర్చలు తరువాత, ఇప్పుడు చత్తీస్‌గఢ్‌ దాడి నేపథ్యంలో శాంతి చర్చల తరహాలో మరోసారి అడుగులు పడుతున్నాయా..? మావోల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు పోయిన తరువాత ప్రభుత్వాలు చర్చలకు సానుకూలంగా ఉన్నారా..? లేక పరోక్షంగా మావోయిస్టు పార్టీనే చర్చల వ్యవహారం తెరపైకి తెస్తుందా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరు ముందుకు వస్తారు..? చర్చలపై ఇటు ప్రభుత్వం అటు మావోయిస్టులకు పూర్తి విశ్వాసం ఉందా..? చర్చలు ఏమేరకు సఫలం అవుతాయి..? ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్నలివి.

మావోయిస్టుల నోటా మరోసారి చర్చల మాట వినిపించింది. ప్రభుత్వంతో చర్చలకు సానుకూలంగా ఉన్నామని కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. తాజాగా.. చత్తీస్‌గఢ్‌ దాడి తరువాత మావోలు చర్చలకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని వెల్లడించారు. ప్రభుత్వం మధ్యవర్తులను పేర్లను వెల్లడిస్తే.. తమ బందీలో ఉన్న జవాన్‌ను విడుదల చేస్తామని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ఓ లేఖను విడుదల చేశారు. మొన్నటి ఎదురుకాల్పుల్లో 22 మంది పోలీసులు, నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ తరువాత దండకారణ్యంలో మావోలు కుంబింగ్ ఆపరేషన్ మరింత పెంచారు. దీంతో మావోయిస్టులు కొన్ని డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచారు.

దండకారణ్యంలో వెంటనే కూంబింగ్ నిలిపేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. దండకారణ్యంలో అడవి బిడ్డలు (గిరిజనులను) ఇబ్బందులకు గురిచేయవద్దని తెలిపారు. సీఆర్పీఎఫ్ జవాన్‌లను అడవుల నుంచి వెనక్కి పంపేలా ఆదేశాలు ఇవ్వాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. దశాబ్ద కాలంగా పోలీసులకు, మావోయిస్టులుకు మధ్య యుద్ధమే జరుగుతోంది. రెండు వైపులా హోరాహోరీగా జరుగుతున్న యుద్ధంలో ఇటు పోలీసులు, అటు మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలంటే శాంతి చర్చలే సమాధానం అంటున్నారు.

కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు ఏమేరకు జరుగుతాయి..? మావోయిస్టుల బందీలో ఉన్న జవాన్‌ను విడుదల చేయడానికి మాత్రమే చర్చలకు మావోయిస్టులు సిద్ధం అయ్యారా..? లేక ఇప్పటివరకు ఉన్న వారి డిమాండ్స్‌పై గతంలో అంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాంతి చర్చలు తరహాలోనే ఇప్పుడు మరోసారి అన్నలు చర్చలకు సిద్ధం అయినట్లు వారి లేఖలు చూస్తే అర్థం అవుతోంది. కానీ.. ఇటు ప్రభుత్వానికి, అటు మావోయిస్టులుకు మధ్య సంధి కుదుర్చడం, చర్చలకు ఆహ్వానం పంపటానికి మధ్యవర్తిత్వం ఎవరూ వహించాలనేదే ఉత్పన్నమవుతున్న ప్రశ్న.. ఒకవేళ ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి మధ్య వర్తులను పంపాలి అనుకుంటే.. వారి పేర్లు వెల్లడించాలని మావోయిస్టు పార్టీ లేఖలో కోరింది.

కానీ.. మేధావులు, పౌర సంఘ నాయకులు, ప్రజా సంఘాలు మాత్రం చర్చలనేవి సాధ్యం కావు అంటున్నాయి. చర్చలు జరగాలి అంటే కేవలం ప్రభుత్వం, మావోయిస్టులు మాత్రమే అనుకుంటే సరిపోదు. పౌర సమాజం, మేధావులు కలిసి ప్రభుత్వంపైన, మావోల పైనే తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తేనే చర్చలకు అవకాశం ఉంటుంది. కానీ.. ఇప్పుడు మావోలు చర్చలు అన్నంత మాత్రాన జరిగే పరిస్థితి లేదంటున్నారు. చత్తీస్‌గఢ్‌లో చర్చలకు మధ్య వర్తిత్వం వహించడానికి ఎవరు లేరని, అక్కడ పౌర సంఘాలు, ప్రజా సంఘాలు గొంతులు నొక్కేయడంతో ఎవరు కూడా ప్రభుత్వాలను నమ్మి మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతి చర్చలు పేరుతో ఓ ఐఏఎస్ అధికారి పౌర సంఘాలు, ప్రజాసంఘాలతో ఓ కమిటీ రూపొందించి చర్చలకు సిద్ధం చేశారు. కానీ.. అప్పటి ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచి మావోయిస్టుల ఉనికి పసిగట్టి, అంతం చేయాలనే పథకం వేశారనే ఆరోపణలు మూట కట్టుకున్నారు. అయితే.. బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్‌ను వదిలిపెట్టడంతో ఇక చర్చల టాపిక్‌కు మరోసారి బ్రేక్ పడినట్లే చెప్పుకోవాలి.