Maldives: భారత్‌ను వేడుకుంటున్న మాల్దీవులు

మోదీ పర్యటను మాల్దీవులు మంత్రులు జీర్ణించుకోలేకపోయారు. మోదీ పర్యటన, ఆయన చేసిన ట్వీట్‌ ప్రభావం తమ దేశ పర్యాటకరంగంపై పడుతుందని భావించి అక్కసు వెళ్లగక్కారు. పర్యాటకంగా మాల్దీవులతో పోలిస్తే లక్ష్యద్వీప్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని పోస్టు పెట్టారు. దీంతో సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

Written By: Raj Shekar, Updated On : May 10, 2024 12:39 pm

Maldives

Follow us on

Maldives: ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాల్దీవుల మంత్రులు మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. దీని తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ముసా జమీర్‌ భారత్‌కు వచ్చారు. ‘మోదీపై తమ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయం కాదని పేర్కొన్నారు. అలా జరిగి ఉండాల్సింది కాదని తెలిపారు. పొరపాటు జరిగిందన్నారు. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో అపార్థాలు చోటుచేసుకున్నాయని, ఇప్పుడు ఆ దశను దాటేశామని పేర్కొన్నారు. భారత్‌–మాల్దీవుల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి అని వెల్లడించారు.

ఏం జరిగిందంటే..
ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ లక్ష్యద్వీప్‌లో పర్యటించారు. కొంతసేపు సముద్రం ఒడ్డున సేదతీరారు. అనంతరం సముద్రంలో స్నార్కెలింగ్‌ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్ట్‌లో లక్ష్యద్వీప్‌ను చేర్చుకోవాలని సూచించారు. ఈమేరకు అక్కడి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ పర్యటనతో స్థానిక పర్యాటక రంగానికి మరితం ప్రోత్సాహం వస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

అక్కసు వెళ్లగక్కిన మాల్దీవులు మంత్రులు..
మోదీ పర్యటను మాల్దీవులు మంత్రులు జీర్ణించుకోలేకపోయారు. మోదీ పర్యటన, ఆయన చేసిన ట్వీట్‌ ప్రభావం తమ దేశ పర్యాటకరంగంపై పడుతుందని భావించి అక్కసు వెళ్లగక్కారు. పర్యాటకంగా మాల్దీవులతో పోలిస్తే లక్ష్యద్వీప్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని పోస్టు పెట్టారు. దీంతో సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

బాయికాట్‌ మాల్దీవ్స్‌ నినాదం..
భారత్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపాయి. ఏకంగా భారతీయులు బాయికాట్‌ మాల్దీవ్స్‌ నినాదం ఇచ్చారు. ఇది చాలా ట్రెండ్‌ అయింది. దీంతో స్పందించిన మాల్దీవులు ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అనంతరం సదరు మంత్రులను తొలగించింది.

భారత వ్యతిరేక నిర్ణయాలు..
తాత్కాలికంగా దిద్దుబాటు చేపట్టినా.. తర్వాత అధ్యక్షుడు మయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. చైనాతో దోస్తీ పెంచుకోవడం సంబంధాలను మరింత దెబ్బతీసింది. ఈ సమయంలో జమీర్‌ భారత్‌తో పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలు, ఒకరిని ఒకరు అర్థం చేసకోవడంపై ఆధారపడి ఉంటాయని ఈ సమావేశంలో జైశంకర్‌ స్పష్టం చేశారు. తాము పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మాల్దీవులకు అవసరం ఉన్న ప్రతీసారి ఆదుకున్నామని గుర్తు చేశారు.