Maharashtra Muslim Reservation Cut: అగ్రవర్ణ పేదలకు కేంద్రం కొన్నేళ్లుగా రిజర్వేషన్లు అమలు చేస్తోంది. వారికి కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు పొందుతున్నారు. మత ప్రాతిపదికన రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించొద్దని సూచిస్తోంది. దీని ఆధారంగా కేంద్రం అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ తెచ్చింది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గతంలో అమలు చేసిన మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ, దాని మిత్ర పక్ష ప్రభుత్వాలు ఎత్తేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో గత ప్రభుత్వం అమలు చేసిన ముస్లింలకు 5 శాతం కోటాను తాజాగా రద్దు చేసింది.
ఉత్తర్వులు జారీ..
మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ను అధికారికంగా రద్దు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిత్వంలో సోషల్ జస్టిస్ విభాగం మంగళవారం జీఆర్ జారీ చేసింది. దీంతో 2014లో జారీగా ఆర్డినెన్స్ రద్దవుతుంది. ఈ కేటగిరీ కింద కుల, నాన్–క్రీమీ లేయర్ సర్టిఫికెట్ల జారీని కూడా నిషేధించారు.
కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం చొరవ..
2014లో కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం ముస్లింలను స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్–ఏ (ఎస్బీసీ–ఏ) కింద చేర్చి ఈ కోటాను ప్రవేశపెట్టింది. బాంబే హైకోర్టు నవంబర్ 2014లో దానిపై స్టే ఇచ్చి, విద్యా సంస్థల్లో మాత్రమే అమలుకు అనుమతించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది, ఫలితంగా అమలు ఆగిపోయింది.
విపక్షాల విమర్శలు
కాంగ్రెస్ నేత వర్షా గైక్వాడ్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ముస్లింలను మెయిన్స్ట్రీమ్ నుంచి దూరం చేస్తుందని ఆరోపించారు. ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే, క్లైడ్ క్రాస్టో బీజేపీ మైనారిటీలకు విలువ లేని పార్టీగా చిత్రీకరించారు. మహావికాస్ అఘాడి పక్షాలు దీన్ని ముస్లిం యువత అభివృద్ధికి అడ్డంకిగా చూస్తున్నాయి.