King Charles Coronation: వెయ్యి సంవత్సరాల సింహాసనం, 300 ఏళ్ల కిరీటం, 80 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం

కింగ్ చార్లెస్ ప్రమాణం పూర్తిగా గానే 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనంపై కింగ్ చార్లెస్ కూర్చుంటారు. ఇది బంగారు సింహాసనమే అయినప్పటికీ రాజు పట్టాభిషేకం నేపథ్యంలో పూర్తిస్థాయిలో మెరుగులు దిద్దారు.

Written By: Bhaskar, Updated On : May 5, 2023 9:21 am
Follow us on

King Charles Coronation: బ్రిటన్.. ఈ పేరు చెప్తే రవి అస్తమించిన సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. ప్రజాస్వామ్య పోకడలు ఉన్నప్పటికీ రాజు వెడలె రవి తేజములలరగా అన్నట్టు రాజరికానిదే హవా. అలాంటి బ్రిటన్ దేశంలో మొన్నటిదాకా క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా వెలుగొందేది. ఆమె మరణం అనంతరం ఇప్పుడు ప్రిన్స్ చార్లెస్_3 మహారాజుగా పట్టాభిషిక్తుడు కానున్నాడు. ఆయన భార్య కెమిల్లా ఆమె కిరీటం ధరించనుంది. అయితే ప్రపంచంలో ఉన్న రాజ కుటుంబాల్లో బ్రిటన్ రాజ కుటుంబానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ సింహాసనానికి, కిరీటానికి, మిగతా వస్తువులకు ఘనమైన నేపథ్యం ఉంది. 1953 తర్వాత బ్రిటన్ ఈ పట్టాభిషేకం జరుగుతున్నది. మే 6న జరిగే ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్న ప్రిన్స్ చార్లెస్_3 పట్టాభిషేకం సందర్భంగా ఆ అరుదైన విషయాలు ఏమిటో మీరూ చదివేయండి.

కాంటెర్ బరీ అర్చ్ బిషప్ పరిచయంతో..

బ్రిటన్ సంప్రదాయాల ప్రకారం రాజు పట్టాభిషేకం సమయంలో వినూత్న పద్ధతి అవలంబిస్తారు. బ్రిటన్ రాజ కుటుంబాల ఆచారం ప్రకారం కాంటెర్ బరీ అర్చ్ బిషప్ కింగ్ చార్లెస్ ను మొదట అక్కడికి వచ్చిన అతిరథ మహారధులందరికీ పరిచయం చేస్తారు. ఆ గదిలోని నాలుగు దిక్కులూ రాజు ప్రదక్షిణ చేస్తాడు. దీని అర్థం నాలుగు దిక్కులో ప్రతి అణువు రాజు ఆధీనంలో ఉంటుందని అర్థం. రాజు ప్రదక్షణ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన వారంతా “గాడ్ సేవ్ కింగ్” అంటే “భగవంతుడు రాజును రక్షించుగాక” అని ఆశీర్వదిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కింగ్ చార్లెస్ రెండు ప్రమాణాలు చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని చార్లెస్ ప్రమాణం చేస్తాడు. దీనికి కూడా ఒక నేపథ్యం ఉంది. పూర్వం కింగ్ ఎడ్గర్ పట్టాభిషేకం సమయంలో ఈ ప్రమాణాలు రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు పట్టాభిషేకం సమయంలో ఈ ప్రమాణాలు కచ్చితంగా చదవాలని ఒక నిబంధన పెట్టారు. అప్పటినుంచి ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం కింగ్ చార్లెస్ కూడా ఈ ప్రమాణాలు చదవాల్సి ఉంటుంది.. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు అత్యంత విధేయుడైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ గా ఉంటానని చార్లెస్ మాట ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రమాణం పూర్తయిన తర్వాత

కింగ్ చార్లెస్ ప్రమాణం పూర్తిగా గానే 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనంపై కింగ్ చార్లెస్ కూర్చుంటారు. ఇది బంగారు సింహాసనమే అయినప్పటికీ రాజు పట్టాభిషేకం నేపథ్యంలో పూర్తిస్థాయిలో మెరుగులు దిద్దారు. ఇక ఈ సింహాసనం కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచుతారు. ఇది రాజుకు అత్యంత రక్షణగా ఉంటుందని రాజ కుటుంబీకుల నమ్మకం. తర్వాత ఆర్చ్ బిషప్ కింగ్ చార్లెస్ ను పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. చేతులు, ఛాతీ, తల పై నూనె పోస్తారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా తెరచాటున జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత జెరూసలేం లోని మౌంట్ ఆఫ్ ఆలీవ్స్ లోని ఆలివ్ చెట్ల నుంచి తీసిన నూనెను గులాబీ, మల్లె తదితర సుగంధాలతో కలిపి తయారుచేసి తీసుకొస్తారు.

అభిషేకం పూర్తి కాగానే

ఇక ఈ నూనెతో అభిషేకం పూర్తి కాగానే చార్లెస్ కు బంగారు తాపడంతో చేసిన మహారాజ గౌన్ తొడిగి సింహాసనంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత శిలువ ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చి బిషప్ ఆయనకు అందిస్తారు. కుడి చేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేస్తారు. దీన్ని సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం అంటారు. 1661 లో తయారైన 2.23 కిలోల బరువైన ఈ బంగారు కిరీటాన్ని పట్టాభిషేకం నాడు ఒక గంట సేపు మాత్రమే ధరిస్తారు. తర్వాత దీనిని భద్రంగా దాస్తారు.. కిరీట ధారణ పూర్తికాగానే వచ్చిన ఆహుతులు మొత్తం గాడ్ సేవ్ కింగ్ అంటూ నినాదాలు చేస్తారు. క్రాస్, పావురం ఉన్న రాజ దండం చార్లెస్ చేతికి రావడంతో అతడికి అధికారం సంక్రమించిందనే దానికి అర్థం. ఇది సుపరిపాలనకు నిదర్శనం అని అక్కడికి వచ్చిన వారు నమ్ముతారు. ఆ తర్వాత రాజు చార్లెస్ పట్టాభిషేకం కుర్చీలో నుంచి లేచి రాజ ఖడ్గాన్ని పట్టుకొని మెట్లు దిగివచ్చి ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై కూర్చుంటారు. రాజు సింహాసనంలో కూర్చోగానే ఆర్చ్ బిషప్ తో పాటు రాజకుటుంబీకులు, రక్తసంబంధీకులైన యువరాజులు, రాజకుటుంబ సిబ్బంది మోకాళ్లపై వంగి కూర్చొని రాజు కాళ్ళకు చేతిని ఆనించి, ఆయన కుడిచేతిని ముద్దాడతారు. రాణి కెమిల్లా పై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేస్తారు.. రాజకుటుబీకుల నిబంధనల ప్రకారం. కెమిల్లాకు ఎటువంటి ప్రమాణం ఉండదు. అయితే ఈ ప్రక్రియ మొత్తం రెండు గంటల్లో పూర్తవుతుంది. ఇక ఆ క్షణం నుంచి చార్లెస్ రాజుగా కొనసాగుతాడు.. రాజ కుటుంబీకుల నిబంధనల ప్రకారం ఇతడికి అన్ని హక్కులు దఖలు పడతాయి. ప్రస్తుతం ప్రిన్స్ చార్లెస్ పట్టాభిషేకం కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.