Kerala Congress internal conflict: అదే సాంప్రదాయం.. అదే కొట్లాట.. రాష్ట్రం మారుతోంది.. నాయకులు మారుతున్నారు.. కానీ గొడవలు మాత్రం అదే తీరుగా ఉంటున్నాయి. దీనిని అంతర్గత ప్రజాస్వామ్యమని చెబుతుంటారు కానీ.. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యహారాలకు ఆస్కారం ఉండదు. ఎత్తులు, పై ఎత్తులు సాగిపోతూ ఉంటే పరిపాలన ఎలా సాగుతూ ఉంటుంది.. ప్రజలకు మెరుగైన భద్రత ఎలా లభిస్తూ ఉంటుంది.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ముఖ్యమంత్రులను మార్చడం కొత్తకాదు. గతంలో అనేక పర్యాయాలు ఈ పని చేసింది. ఇప్పుడు కూడా చేస్తోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో సిద్ధ రామయ్యను ఆ పదవి నుంచి దించింది. అది కూడా ఒక్క రోజులోనే సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు జరిగాయి. రాహుల్ గాంధీ.. మల్లికార్జున కార్గే వంటి వారంతా ఈ పర్వంలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్.. పరమేశ్వర.. రాజీనామా చేసిన సిద్ధరామయ్య.. వారంతా ఢిల్లీలోనే ఉన్నారు. కొద్దిరోజులుగా వారంతా లాబీయింగ్ చేసుకుంటూ ఉన్నారు. పదవుల కోసం వారంతా అక్కడ ఉంటుంటే కర్ణాటక రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంటుంది.. ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి.. అనే ప్రశ్నలు మీడియా వేసినప్పుడు కాంగ్రెస్ నాయకుల దగ్గర సమాధానం లేకుండా పోతుంది.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోలేదు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన నాటి నుంచి ఆయనకు ప్రతిదీ అనుకూలంగా మారలేదు. డీకే శివకుమార్ వర్గం ఏదో ఒక రూపంలో ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉంది. చివరికి రెండున్నర సంవత్సరాల పరిపాలనా కాలాన్ని ఆయన ముక్కుతూ మూలుగుతూ పూర్తి చేశారు. దీనివల్ల కర్ణాటక రాష్ట్రంలో పెట్టుబడులు.. శాంతి భద్రతలు.. ఇతర వ్యవహారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొన్ని రకాల కుంభకోణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రభావం స్థానిక ఎన్నికలు.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద భారీగానే పడింది.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖాయమైనప్పటికీ.. సిద్ధరామయ్య కుమారుడు యతేంద్రకు కీలకమైన శాఖలు ఇస్తున్నారట.. అంతేకాదు ఆయనను డిప్యూటీ సీఎం గా నియమిస్తున్నారట. అధిష్టానం చెప్పినట్టుగా సిద్ధరామయ్య రాజ్యసభకు వెళ్లి పోరట. ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఏమీ అనుకోరా.. నెగిటివ్ ఆలోచనలు ఏమీ రావా.. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం అనేది అంతర్గతంగా సాగిపోవాలి. అందులో గొడవలకు.. వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలి. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం నిజంగా ప్రజలను పిచ్చివాళ్లను చేయడమే.. పరిపాలన సాగించండి అంటూ ప్రజలు ఓటు వేస్తే కాంగ్రెస్ పాలకులు చేస్తున్న పని ఇలా ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.
బిజెపి కూడా ముఖ్యమంత్రులను మార్చేస్తూ ఉంటుంది. గుజరాత్ లో కూడా అనేకసార్లు ముఖ్యమంత్రులను మార్చేసింది. కానీ ఏ రోజు కూడా ఈ స్థాయిలో చర్చనీయాంశం కాలేదు. చివరికి పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారికి ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చే విషయంలో కూడా బిజెపి రహస్య విధానాన్ని పాటించింది. మీడియాకు ఏ ఒక్క లీకు కూడా ఇవ్వలేదు. అస్సాంలో హిమంత.. విషయంలో కూడా బిజెపి సీక్రసీ విధానాన్ని కొనసాగించింది. కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రులను బిజెపి మార్చినప్పుడు ఈ స్థాయిలో ఎన్నడూ వివాాదం కాలేదు. పైగా నాయకులు షరతులు విధించే పరిస్థితి కాషాయ నాయకులు తీసుకురాలేదు.
కాంగ్రెస్ పార్టీ కేవలం కర్ణాటకతోనే కాదు.. ఆ మధ్య తెలంగాణలో కూడా.. తాజాగా కేరళలో కూడా ఇదే తీరైన వాతావరణాన్ని కొనసాగించింది. తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానం కోసం ఒక కీలక నాయకుడు భారీగా పైరవీలు చేశారు. చివరికి కొంతమంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ గట్టిగా పట్టు పట్టడంతో ఆ నేత వెనక్కి తగ్గినట్టు సమాచారం. అందువల్లే ముఖ్యమంత్రి ఎంపికలో జాప్యం జరిగింది. కేరళలో కూడా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల దాగుడుమూతలు ఆడింది. వేణుగోపాల్ కు ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని అందరు అనుకున్నారు. కానీ సతీషన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇందులో కూడా క్యాంపు రాజకీయాలు జరిగాయి. చాలా రోజులపాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో మంతనాలు జరిగాయి.
ఇలా చెప్తే బిజెపికి అనుకూలంగా రాస్తున్నారు అనుకోవచ్చు గాని.. కాంగ్రెస్ పార్టీలో ఇంత దారుణంగా అంతర్గత కలహాలు బహిర్గతంగా జరుగుతుంటే రాయకుండా ఎలా ఉంటారు.. అది ఎలా సాధ్యమవుతుంది. వాస్తవానికి ఎలక్షన్స్ లో పోటీ చేసిన తర్వాత.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత.. పదవుల కోసం రాజకీయ నాయకులు అంతర్గతంగా చర్చించుకోవాలి. పైగా అది అంతర్గత వ్యవహారం కూడా.. అలాకాకుండా ఇలా మూకుమ్మడి పోరాటాలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎటువంటి అంతర్గత ప్రజాస్వామ్యమో నేతలు చెప్పాలి.. కాంగ్రెస్ పార్టీ ఇలానే వ్యవహరించుకుంటూ వెళ్తే.. బిజెపిని కేంద్రంలో అధికారం నుంచి దించడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిజెపిలో సాధ్యమైన రాజకీయ క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అమలు కావడం లేదని.. అందుకే ప్రజలు ఆ పార్టీని దూరంగా పెడుతున్నారని వారు చెబుతున్నారు.
