Homeజాతీయ వార్తలుకేసీఆర్ స్కెచ్: ఈటెల పోస్ట్ ఊస్టేనా?

కేసీఆర్ స్కెచ్: ఈటెల పోస్ట్ ఊస్టేనా?

తెలంగాణ ఉద్యమకారుల్లో ప్రముఖుడు ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలినాళ్లలో కేసీఆర్ ఢిల్లీలో చక్రంతిప్పితే.. రాష్ట్రంలో టీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా ఈటల రాజేందర్ ఉండేవారు. నాడు కేటీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. హరీష్ రావు అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ ను ఉమ్మడి ఏపీలో భుజాలపై మోసింది ఈటల రాజేందర్ యే అనడంలో ఎలాంటి సందేహం లేదు..

ఇక వ్యక్తిగతంగా కూడా ఈటెల సౌమ్యుడు. ఎంతో మంది తన నియోజకవర్గం అయిన హుజూరాబాద్ లో ఎంతో మందికి ఆయన సాయం చేశారు. మంచి నాయకుడిగా పేరొందారు. 2004 నుంచి వరుసగా హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ ప్రజల మనిషిగా పేరొందారు.

మచ్చలేని ఈటల రాజేందర్ పై తాజాగా మచ్చపడింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూముల కబ్జా వ్యవహారంలో మంత్రి ఈటల రాజేందర్ చిక్కుకున్నారు. తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అక్రమంగా అసైన్డ్ భూములను కబ్జా చేశారని.. గ్రామస్థులను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటల, ఆయన అనుచరులు సూరి, యాంజాల సుధాకర్ రెడ్డి గ్రామస్థులను బెదిరించారని ఫిర్యాదు చేశారు. వారి చెర నుంచి కాపాడాలని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.

దీనిపై సీఎం కేసీఆర్ వేగంగా స్పందించడం విశేషం. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముందుగా ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చి ప్రాథమిక నివేదికను అందించాలని.. ఆ తర్వాత సమగ్ర విచారణ జరుపాలని కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.దీన్ని బట్టి కేసీఆర్ కు, ఈటెల రాజేందర్ కు ఎక్కడో చెడిందని అర్థమవుతోంది.

అయితే కొద్దిరోజులుగా ఈటెల రాజేందర్ బయటపడిపోతున్నారు. టీఆర్ఎస్ లో ఆయనకు ఏమవుతుందో కానీ అసహనంతో రగిలిపోతున్నారు. సొంతపార్టీ పైనే అక్కసు వెళ్లగక్కుతున్నారు. రెండోసారి కేబినెట్ లో అసలు ఈటెలకు స్థానం దక్కలేదని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కేటీఆర్ కల్పించుకొని మంత్రి పదవిని ఇచ్చారని ప్రచారం సాగింది. ఆ తర్వాత కూడా ‘తెలంగాణకు మేమే బాసులం’ అంటూ కేసీఆర్ పై ధీక్కార వ్యాఖ్యలు ఆ మధ్య  ఈటల చేశారు.

ఇక సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని ఈటల పలు వేదికల్లో అసహనాలు వ్యక్తం చేశారు. దీంతో చాలా రోజులుగా ఈటెలపై గుర్రుగా ఉన్న అధిష్టానం ఇప్పుడు ఈ భూకబ్జా ఆరోపణల్లో ఈటెలను బుక్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

తమ చేతికి మట్టి అంటకుండా ఈటలను సాగనంపే ప్లాన్ ను టీఆర్ఎస్ అధిష్టానం చేసిందా? అన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే రైతులు తెరపైకి వచ్చారని అంటున్నారు. ఆ రైతులు ఫిర్యాదు చేయడంతో కేసీఆర్ అంతే వేగంగా స్పందించి విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమైంది.

అన్న అని ముద్దుగా కేసీఆర్ ను పిలుస్తాడు ఈటల రాజేందర్ .. కేసీఆర్ కు చాలా సన్నిహితుడైన ఈటల విషయంలో గులాబీ బాస్ ఇలా విచారణకు ఆదేశించడమే సంచలనమైంది. దీన్ని బట్టి ఈటల మంత్రి పోస్టు ఊస్ట్ అయినట్టేనని తెలుస్తోంది.

మొన్నటికి మొన్న ఉత్తరతెలంగాణకు చెందిన మంత్రి ఓ మహిళతో రాసలీలలు చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోని కేసీఆర్ ఇప్పుడు ఈటెల విషయంలో ఏకంగా వేగంగా స్పందిస్తూ సీఎస్ కు విచారణ జరుపాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం వారిదే కావడంతో ఈటలను కాపాడే చాన్స్ కేసీఆర్ సర్కార్ కు ఉంది. రైతులను మేనేజ్ చేసి ఈటలతో కలిసి దీన్ని బయటకు రాకుండా చేయగల సామర్థ్యం టీఆర్ఎస్ కు ఉంది. ఎందుకంటే మెదక్ జిల్లా నుంచి ఉన్న హరీష్ రావు ఏదైనా చేయగలరు. తలుచుకుంటే ఈటెల కబ్జా ఆరోపణలను అక్కడే భూస్థాపితం చేసేయగల నేర్పరి. కానీ కేసీఆర్ సర్కార్ ఇలా ఓపెన్ కావడమే చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి మంత్రి ఈటెల పోస్టుకు కేసీఆర్ రైతుల ద్వారా బ్లేమ్ చేసేలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

బీజేపీ శ్రేణులు, తీన్మార్ మల్లన్న సైతం ‘ఈటెల’ను కేబినెట్ నుంచి సాగనంపేందుకు కేసీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నాడని.. ఉద్యమకారుడిని తీసివేస్తున్నారని ఆరోపించడం సంచలనమైంది. ఏది ఏమైనా అంత సన్నిహితుడైన ఈటల విషయంలో కేసీఆర్ సీరియస్ గా స్పందించడమే ఇక వీరిద్దరి బంధానికి బీటలు వారినట్టు స్పష్టమైంది. ఇది ఈటెల మంత్రి పదవికి ఎసరు వచ్చిందని అర్థమవుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular