KCR National Politics: అస్సలు రానేరాదు అనుకున్న తెలంగాణను కేసీఆర్ రప్పించారు. నయానో భయానో.. ఎత్తులో పై ఎత్తులో.. తెలంగాణ పార్టీలన్నింటినీ ‘జేఏసీ’ అనే తాడుతో బిగించి తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ లక్ష్యానికి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని సాధించారు.. సీఎం అయ్యారు. కేసీఆర్ కలలో కూడా ఊహించని విధంగా తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యి పాలనతో చేరువయ్యారు. అయితే రాజకీయ ఎత్తుగడల్లో చాణక్యుడి వలే కేసీఆర్ అడుగులు ఉంటాయి. ఆయన వేసే అడుగులు పక్కన ఉండే వారికి కూడా తెలియదంటారు.. ‘ఓటుకు నోటు’, ముందస్తు ఎన్నికలు, నయీం, దిశా నిందితుల ఎన్ కౌంటర్ లాంటివి ఎవరూ ముందుగా ఊహించలేదు. అందుకే కేసీఆర్ ఓ పట్టాన అర్థం కారంటారు.
కేసీఆర్ ప్రేమించినా.. ద్వేషించినా అది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధాని మోడీని ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. ఆపై ఆయనపైనే కత్తి దూస్తారు. కేసీఆర్ పంతం పడితే ఎలా ఉంటుందన్నది పోయిన బడ్జెట్ సమావేశాలతోనే చూశాం.. తన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ నియమించిన గవర్నర్ తమిళసై ప్రసంగంతో ప్రారంభం కావాల్సిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ఏవో సాంకేతిక కారణాలు చూపి ప్రసంగం లేకుండానే ముగించారు. ధన్యవాదాలు తెలిపే తీర్మానం సంప్రదాయన్ని సైతం కేసీఆర్ పక్కనపెట్టారంటే ఆయన ఎవరితో అయినా ఎంతలా పోరాడగలరో నిరూపించారు.
తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మూడోసారి కూడా రావాలని ఆశపడుతున్నారు. రాజకీయంగా బలంగా ఉన్నా రెండు దఫాల అధికారంతో వ్యతిరేకత బాగా వచ్చింది. సహజంగానే ప్రజల్లో అసంతృప్తి వెల్లువలా వస్తోంది. అందుకే మూడోసారి గెలుపు ‘కష్టం’ అని కేసీఆర్ సైతం ఒకింత ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తన లాంటి రాజకీయ చాణక్యుడి ఐడియాలను సైతం పక్కన పెట్టి దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంను వినియోగించుకుంటున్నారు.
నిజానికి దేశ రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన రాజకీయ వ్యూహకర్త మరొకరు లేరు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కాంగ్రెస్ ను కాదని.. రెండు సార్లు తనకు పట్టం కట్టేలా రాజకీయం చేయగలిగారు. మూడోసారి ముచ్చటగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉబలాటపడుతున్నారు.
కేసీఆర్ కు సానుకూలత ఏంటంటే.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా లేదు. ఆపార్టీకి సరైన నాయకులు లేకపోవడం మైనస్. ఆ సంగతి కేసీఆర్ కు బాగా తెలుసు. టీఆర్ఎస్ నుంచే బీజేపీ నేతలను లాగి గెలుస్తోంది. దుబ్బాకలో రఘునందన్ రావు, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ లు టీఆర్ఎస్ లో పనిచేసిన వారే. అందుకే పంతం పట్టి కేసీఆర్ అభాసుపాలయ్యారు. ఈటల ఎపిసోడ్ తో హర్ట్ అయ్యారు. అందుకే బీజేపీ పై పడ్డారు. కొరకరాని కొయ్యగా తయారవుతున్న బీజేపీని టార్గెట్ చేశారు. దేశ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే బీజేపీని టార్గెట్ చేసి మరో సెంటిమెంట్ అస్త్రంతో తెలంగాణలో గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారట..
Also Read: సంజయ్ రెండో విడత పాదయాత్ర ఆ రోజునుంచే.. చాలా పెద్ద ప్లాన్ వేశాడుగా
రెండు సార్లు తెలంగాణ సెంటిమెంట్ పనిచేసి కేసీఆర్ గెలిచారు. మూడోసారి ఆ అస్త్రం పనిచేయదు. ఆంధ్రా పాలకులపై విమర్శలు వచ్చే ఎన్నికల్లో వర్కవుట్ కావని కేసీఆర్ కు తెలుసు. అదుకే బీజేపీని సరికొత్త అస్త్రాలతో కొట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకత.. బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తోందన్న నినాదాన్ని పట్టుకున్నారు. బీజేపీ ఎదిగినా.. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం బలపడకూడదని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సమంగా చీల్చితే విజయం టీఆర్ఎస్ దే. అదే వ్యూహంతో కేసీఆర్ ముందుకుసాగుతున్నారు.
ఎన్నికల ట్రెండ్ తెలియకుండా దేశ రాజకీయాల్లోకి వెళితే గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది. మోడీ పై వ్యతిరేకత.. ఆయనను ఢీకొట్టవచ్చా లేదా అన్నది తెలుసుకోవడానికే కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఎన్నికల కంటే ముందే బీజేపీతో ఫైట్ కు దిగారు. పక్కా వ్యూహాలతోనే కేసీఆర్ ముందుకెళుతున్నారు. పీకే సాయంతో జాతీయ రాజకీయాల్లోకి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మరి మోడీ ఓడిపోతేనే కేసీఆర్ వెలుగులోకి రాగలరు. దేశ ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందన్న దానిపైనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
Also Read: పార్టీ గెలిస్తే తొలి సంతకం దాని మీదే అంటున్న రేవంత్.. కాంగ్రెస్లో అగ్గి రాజుకుంటుందా..?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More