KCR KTR: కేసీఆర్ మార్చమంటాడు.. కేటీఆర్ రక్షించాలంటాడు!

KCR KTR: భారత రాజ్యాంగంపై తెలంగాణలో ఎన్నడూ లేనంతంగా చర్చ జరుగుతోంది. స్వరాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన రాజ్యాంగంపై అధికారంలో ఉన్న నాయకులే భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని.. కొత్త రాజ్యాంగం రాయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల డిమాండ్‌ చేశారు. 75 ఏళ్ల నాటి రాజ్యాంగం ఇప్పుడు పనిచేస్తలేదని.. సుపరిపాలన, రిజర్వేషన్ల పెంపుకోసం నూతన రాజ్యాంగం కావాలని వ్యాఖ్యానించి సరికొత్త చర్చకు తెరలేపారు. దీంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాజ్యాంగాన్ని దళితుడు […]

Written By: NARESH, Updated On : April 15, 2022 6:25 pm
Follow us on

KCR KTR: భారత రాజ్యాంగంపై తెలంగాణలో ఎన్నడూ లేనంతంగా చర్చ జరుగుతోంది. స్వరాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన రాజ్యాంగంపై అధికారంలో ఉన్న నాయకులే భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని.. కొత్త రాజ్యాంగం రాయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల డిమాండ్‌ చేశారు. 75 ఏళ్ల నాటి రాజ్యాంగం ఇప్పుడు పనిచేస్తలేదని.. సుపరిపాలన, రిజర్వేషన్ల పెంపుకోసం నూతన రాజ్యాంగం కావాలని వ్యాఖ్యానించి సరికొత్త చర్చకు తెరలేపారు. దీంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాజ్యాంగాన్ని దళితుడు అయిన అంబేద్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ కమిటీ రూపొందించిన కారణంగానే కేసీఆర్‌ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించారని విమర్శించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన రాజ్యాంగాన్నే ప్రశ్నించే స్థాయికి కేసీఆర్‌ దిగిపోయారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చడం కాదని, రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారుతున్న కేసీఆర్‌నే గద్దె దించాలని ప్రతిపక్షాలు ప్రజలను కోరాయి.

ఇంత జరిగినా కేసీఆర్‌ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోలేదు. పైగా మరోమారు మీడియా సమావేశం నిర్వహించి.. రాజ్యాంగం మార్చాలన్న మాటకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. రాజ్యాంగంతో దళిత సంఘాలకు ఏం సంబంధం అని ఎదురు ప్రశ్నించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేయడం చేతగాని కేసీఆర్‌ కల్వకుంట్ల రాజ్యాంగం.. రాచరిక రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళిత సంఘాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దళితులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మలు దహనం చేశారు. దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి అయిన కేసీఆర్‌ను తెలంగాణలో అధికారం నుంచి దించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. దీంతో కేసీఆర్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఆ తర్వాత రాజ్యాంగం మార్పు వ్యాఖ్యలపై సైలెంట్‌ అయ్యారు..

-రాజ్యాంగాన్ని గౌరవిస్తాం..
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి రాజ్యాంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన తన తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడారు. రాజ్యాంగం అంటే తమకు ఎంతో గౌరవమని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారమే స్వరాష్ట్ర ఆకాంక్ష సాధ్యమైందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోందని విమర్శించారు. మతం పేరుతో దేశంలో అరాచకం చేయాలని చూస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు..

-డ్యామేజీ కవర్‌ కోసమే..
రాజ్యాంగంపై తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి, కేసీఆర్‌కు జరిగిన డ్యామేజీని కవర్‌ చేయడానికే కేటీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ దళిత వ్యతిరేకి అన్న భావన తెలంగాణ దళితుల్లో ఉంది. ఈ భావనను బలపర్చేలా కేసీఆర్‌ ఎన్నడూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి వేడుకల్లో పాల్గొనలేదన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించిన సమయంలోనూ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అంబేద్కర్‌ ఫొటో కంటే కేసీఆర్‌ ఫొటోనే పెద్దగా ఉండేలా చూసుకున్నారంటున్నారు. ప్రసంగంలో మాత్రం దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రనకటించారు. ఇక్కడే ఆయనపై దళితుల్లో ఉన్న భావన మరింత బలపడిందని పలువురు పేర్కొంటున్నారు. అందాక ఎందుకు.. ఇంటికి రూ.10 లక్షలు ఇచ్చినా హుజూరాబాద్‌ దళితులు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయలేదని చెబుతారు. ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో కేసీఆర్‌కు దళితులు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా కేసీఆర్‌ రాజ్యాంగ అనుకూల వ్యాఖ్యలు చేయడమే కాకుండా దళితులతో కలిసి భోజనం చేశారని భావిస్తున్నారు.

-ప్రగతిభవన్‌లో మొక్కుబడి వేడుకలు..
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ఎన్నడూ పాల్గొనని సీఎం కేసీఆర్‌ తొలిసారిగా గురువారం ప్రగతిభవన్‌లో మొక్కుబడిగా జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మోత్కుపల్లి నర్సింహులు మినహా దళితులెవరూ లేరు. ఆయన క్యాబినెట్‌లో ఉన్న దళిత మంత్రులను గానీ, దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గానీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. కేవలం అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఓ నమస్కారం చేసి వేడుకలు ముగించారని టీఆర్‌ఎస్‌ పార్టీలోని దళిత నాయకులే పేర్కొనడం గమనార్హం.