JanaSena- TDP: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లపై వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీకి క్షేత్ర స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తున్న వలంటీర్లను పవన్ టచ్ చేసిన నేపథ్యంలో వైసీపీ వర్సెస్ జనసేన అన్న విధంగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో వైసీపీ నాయకులు, వలంటీర్లు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాలతో జనసేన ప్రజల్లోకి బాగా చొచ్చుకు పోయేందుకు ఉపయోగపడుతుంది. మరోవైపు వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ వెనుకబడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జనసేన పార్టీ ప్రారంభించిన నాటి నుంచి పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్నంత స్థాయిలో చేరుకోలేకపోయారు. గడిచిన ఎన్నికల్లో 30 శాతం ఓటు బ్యాంకును సంపాదించుకోగలిగారు. 2019 తర్వాత జనసేన రాష్ట్రంలో నిలకడ సంపాదించుకున్నారు. 2024 ఎన్నికల్లో కీ రోల్ గా మారడానికి అవసరమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే, మరింత ప్రజల్లోకి చేరుకోవడానికి అధికార వైసీపీపై పోరాటం చేస్తూనే ఉంది. జగన్ అధికారం చేపట్టాక ఆకృత్యాలు, అరాచకాలు ఎక్కువైపోయాయి. వీటిపై పవన్ మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు.
పొత్తుల ప్రస్తావన లేకుండా ఒంటరిగా పోటీ చేయాలన్నది వైసీపీ ఆలోచన. ప్రతిపక్షాలు కూడా అదే మాదిరిగా ఎన్నికల బరిలోకి రావాలని సవాల్ విసురుతోంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని నిన్నా మొన్నటి వరకు జరిగిన ప్రచారంపై ఆయా పార్టీల నుంచి స్పష్టత రావడం లేదు. టీడీపీని పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గర చేయాలని చూసినా, సాధ్యపడలేదు. ఆ తరువాత ఇప్పటి వరకు పొత్తులపై ఏ పార్టీ కూడా స్పష్టమైన విధానం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైన తరువాత ప్రజల్లో అనూహ్య స్పందన వస్తోంది. ఆయన బహిరంగ సభ ఏర్పాటైన ప్రతీచోట వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో చిన్నబాబు ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఒక్కసారిగా చినబోయిందా అన్నట్లు తయారైంది. పవన్ కల్యాణ్ వార్తలను కవర్ చేస్తే టీఆర్పీ రేటింగ్ కూడా బాగా వస్తుండటంతో లోకేష్ ప్రచారాన్ని కాస్త తగ్గించినట్లుగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కంటే జనసేన బాగా మెరుగైంది.
పవన్ కల్యాణ్ తాజాగా వలంటీర్ల వ్యవస్థపై చేస్తున్న ఆరోపణలు జనసేనను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మరోవైపు జనసైనికులు కూడా తగ్గడం లేదు. వలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సర్వేలు చేయించడమేకాక ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తోంది. వలంటీర్ల ముసుగులో చాలా మంది అరాచక శక్తులుగా మారుతున్నారు. దీనిని పవన్ కల్యాణ్ బహిర్గతం చేశారు. వలంటీర్ల వ్యవస్థను స్వప్రయోజనానికి వైసీపీ ఎలా వాడుకుంటుందో ప్రజలకు తెలియజేసి వరుసగా విమర్శలు చేస్తుండటంతో, వైసీపీ నాయకులు డిఫెన్స్ లో పడిపోయారు. వలంటీర్లను రెచ్చగొట్టి పవన్ పై దుష్ర్పచారం ప్రారంభించారు. అంతిమంగా పవన్ కల్యాణ్ ప్లాన్ వర్కవుటయ్యింది. జనంలోకి జనసేన మరింత వేగంగా చొచ్చుకు పోతోంది. ఇది ఇక్కడితో ఆగేలా కనబడటం లేదు.