ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ లక్ష్యాలతో ఒకొక్క పధకాన్ని ప్రారంభించడం, సంస్థను ఏర్పర్చడం, ఆ తర్వాత అంతటితో తన పనైపోయిన్నట్లు వాటి గురించి పట్టించుకొనక పోవడం చేస్తుంటారు. ఆ విధంగా గత 10 నెలల్లో ఆయన ప్రారంభించిన అనేక కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి.
అందుకు ప్రత్యక్ష నిదర్శనం రాష్ట్ర వ్యవసాయ కమీషన్. రైతులు నిరంతరం ఎదుర్కొనే సమస్యలపై చర్చించి ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో ఏర్పాటైన రాష్ట్ర వ్యవసాయ కమీషన్ భేటీ జనవరి 6 తర్వాత జరగనే లేదు. లాక్డౌన్ ప్రభావంతో రైతాంగం తీవ్ర నష్టాలపాలవుతున్న దృష్ట్యా వ్యవసాయ మిషన్ సమావేశమై తగిన నష్ట నివారణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతుందని ఆశించగా, సరిగ్గా ఇప్పుడే మిషన్ భేటీ సుదీర్ఘకాలం వాయిదా పడటంగ మనార్హం.
గత టిడిపి ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందన్న వైసిపి, ఆ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకంటూ రాష్ట్ర వ్యవసాయ మిషన్ను అధికారమలోకి వచ్చిన రెండు నెలల్లోనే నెలకొల్పింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ మిషన్ ఏర్పాటు కావడం, దీనిలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు, రైతు, వ్యాపార ప్రతినిధులను సభ్యులుగా వేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
విధిగా నెలకోసారి సిఎం అధ్యక్షతన మిషన్ భేటీ ఉంటుందని ఉత్తర్వుల్లో సైతం పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి, వాటికి తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపించే వ్యూహాత్మక పత్రాలు రూపొందించడం మిషన్ ప్రధాన లక్ష్యం. దీనిలో మార్కెట్ సమస్య అత్యంత కీలకం.
లాక్డౌన్ ఇప్పుడప్పుడే ముగియదని తాజాగా వార్తలొస్తున్నాయి. వ్యవసాయ కార్యక్రమాలు, పంటల కొనుగోళ్లు, రవాణాపై లాక్డౌన్ ఆంక్షలు లేకున్నా, సమస్య తీవ్రంగానే ఉంది. రబీ పంటలు చేతికొచ్చే సమయంలో లాక్డౌన్ రావడంతో పంటల కొనుగోళ్లు నిలిచిపోయాయి. విజయనగరంలో సుమారు లక్ష టన్నుల ఖరీఫ్ వరి ధాన్యం రైతుల వద్దే ఉంది. నెల్లూరులో ఖరీఫ్ ధాన్యం 18 లక్షల టన్నుల వరకు రైతుల వద్ద పేరుకుపోయింది.
ఏప్రిల్ రెండో వారం నుంచి రబీ పంట కోతలకొస్తుంది. మొక్కజొన్న, జొన్న, పప్పుల వంటి ఆహార పంటలు, మిర్చి, పూలు, కూరగాయలు, మామిడి, అరటి, బత్తాయి వంటి ఉద్యానవన పంటల మార్కెట్ సైతం స్తంభించింది. ఆక్వా ఉత్పత్తులదీ అదే దారి. ఈ ఆందోళకర పరిస్థితుల్లోనన్నా రాష్ట్ర స్థాయి వ్యవసాయ మిషన్ భేటీ నిర్వహించి, ఆచరణాత్మక చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఆ ఆలోచన చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదు.
మిషన్ను నెలకొల్పిన తొలినాళ్లల్లో సిఎం అధ్యక్షతన ప్రతి నెలా సమావేశాలు జరిగాయి. ఆ భేటీలో ప్రకటించిన కొన్ని నిర్ణయాలు అమలు కాకపోతుండడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ఉదాహరణకు విపత్తుల వలన నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు రూ.2,000 కోట్లు తక్షణం చెల్లించాలని స్వయంగా ముఖ్యమంత్రి తొలి రెండు మూడు మిషన్ భేటీల్లో ఆదేశించినా అమలుకు నోచుకోలేదు.