Rishikonda
Rishikonda: ఏపీ సర్కార్ వ్యవహార శైలి ఎవరికీ అంతు పట్టడం లేదు. చేసిన పనిని కూడా ధైర్యంగా చెప్పుకోలేని స్థితిలో ఉండడం విచారకరం. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది. ఆ పని చేయకపోగా ప్రజల్లో గందరగోళం, అయోమయం పెరిగేలా వ్యవహరిస్తోంది.రుషికొండపై సెక్రటేరియట్ కడుతున్నామని ప్రభుత్వం అధికారికంగా ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఎందుకో ఆ పోస్ట్ ను రాత్రికి రాత్రే డిలీట్ చేశారు. పొరపాటున రాశామని చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఓ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపాలని నిర్ణయించుకుని.. చివరికి న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించిఈ విధంగా వ్యవహరించినట్లు టాక్ నడుస్తోంది.
రిషికొండ అన్నది పక్కాగా టూరిజం ప్రాజెక్టు. అక్కడ ఇంతకు ముందు ఉన్న హోటళ్లను కూల్చేసి.. అత్యంత విలాసవంతమైన హోటల్ ను కట్టిస్తున్నారు. అప్పులు కూడా ఆ పేరు మీదనే తెచ్చారు. సర్క్యూట్ హౌస్ ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారని జనసేనాని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు కొండను తొలచడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
గతంలో వైసీపీ సీనియర్లు, మంత్రులు రిషికొండ విషయంలో విభిన్నంగా ప్రకటనలు చేశారు. అక్కడ ఏ భవనం కడితే మీకెందుకంటూ దబాయించేవారు. బొత్స లాంటి నేతలైతే అక్కడ సీఎంవో కడతామంటూ వ్యంగ్యోక్తులు విసిరేవారు. ప్రస్తుతం అక్కడ కడుతున్న నిర్మాణాలన్నీ హోటల్ లాలేవు. మొత్తం ఐదు భవనాల వరకు నిర్మిస్తున్నారు. అందులో ఒకటి ఇంద్రభవనం. మరో నాలుగు భవనాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఓ అవసరం కోసమే వాటిని నిర్మిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ భవనాలు ఏమిటో అన్నది ప్రభుత్వం వెల్లడించకపోవడం అనుమానాలను పెంచుతోంది. ప్రజలకు కూడా తెలియపరచకపోవడాన్ని ఏమంటారు. ఎప్పటికైనా రిషికొండపై కట్టడాలు ఎందుకో ప్రభుత్వం ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటేమూల్యం చెల్లించుకోక తప్పదు.